కావాల్సిన సీట్లపై కర్ఛీఫ్ వేశారు! | Two ministers in the process of setting constituencies for successors | Sakshi
Sakshi News home page

కావాల్సిన సీట్లపై కర్ఛీఫ్ వేశారు!

Jun 18 2026 5:38 AM | Updated on Jun 18 2026 5:38 AM

Two ministers in the process of setting constituencies for successors

వారసులకు నియోజకవర్గాలను సెట్‌ చేసే పనిలో ఇద్దరు మంత్రులు!

అసెంబ్లీ ఎన్నికలకు రెండున్నరేళ్ల ముందే వ్యూహాల్లో నిమగ్నం

పాలకుర్తిపై మంత్రి పొంగులేటి గురి.. అల్లుడి కోసం వియ్యంకుడితో కలిసి యత్నాలు?

ప్రస్తుత ఎమ్మెల్యే యశస్వినిరెడ్డికి అసమ్మతి సెగ

అసమ్మతి నేతలకు ఎంపీ వేం సహకారం..ఆయన కుమారుడి కోసమేనని ప్రచారం

కుమార్తె త్రిష కోసం జహీరాబాద్‌పై మంత్రి దామోదర ఫోకస్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రులు ఇద్దరు తమ రాజకీయ వారసుల కోసం ఇప్పటినుంచే నియోజకవర్గాలను సెట్‌ చేస్తున్నారా? అసెంబ్లీ ఎన్నికలకు రెండున్నరేళ్ల ముందే పరిస్థితులకు అనుగుణంగా పావులు కదుపుతూ, కాంగ్రెస్‌ మార్కు రాజకీయం చేస్తూ కుటుంబ సభ్యుల భవిష్యత్తు కోసం వ్యూహాలు పన్నుతున్నారా? వీరి వ్యూహాల్లో ఒక చోట రాజ్యసభ సభ్యుడు, మరోచోట లోక్‌సభ సభ్యుడు పాలుపంచుకుంటున్నారా? వీరి సహకారం వెనుక మరో తంత్రం ఉందా? అంటే.. పాలకుర్తి, జహీరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితులను బట్టి చూస్తే అవుననే సమాధానమే లభిస్తోంది. తన అల్లుడు, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘు రామిరెడ్డి కుమారుడు అర్జున్‌రెడ్డి కోసం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాలకుర్తిపై, తన కుమార్తె త్రిష కోసం ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జహీరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంపై గురి పెట్టారని స్థానిక కాంగ్రెస్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సులభంగా టికెట్‌ తెచ్చుకోగలమని, ఒకవేళ జరగకపోతే రేసులో గట్టిగా ఉండాలనే ఆలోచనతో ఇద్దరు మంత్రులు పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు నియోజకవర్గాల్లోని వివాదాల వ్యవహారం టీపీసీసీ క్రమశిక్షణా సంఘం ముందుకు రావడం గమనార్హం. 

పాలకుర్తిలో కదులుతున్న పావులు
పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డికి అసమ్మతి సెగలు భారీగా తగులుతున్నాయి. ఆమె అత్త, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డికి వ్యతిరేకంగా పలువురు కాంగ్రెస్‌ నేతలు గళమెత్తుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఝాన్సీరెడ్డిని కాదని ఇతర అభ్యర్థులకు వారు బహిరంగంగానే మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి యశస్వినిరెడ్డితో కలిసి ఝాన్సీరెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే యశస్వినిరెడ్డి ఫిర్యాదు చేసిన ఇద్దరు నేతలు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన సమయంలో ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి కూడా వారితో కలిసి రావడం పార్టీలో చర్చనీయాంశమవుతోంది. 

పార్టీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి మద్దతుగా ఎంపీ రాగా, ఇందుకు మంత్రి పొంగులేటి సహకారం ఉందని, పాలకుర్తి నుంచి ఈసారి తన కుమారుడిని పోటీ చేయించే ఆలోచనలో రఘురామిరెడ్డి ఉన్నారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే అసమ్మతి నేతలకు ఆపన్న హస్తం అందిస్తున్నారనేది బహిరంగ రహస్యమేనని పార్టీ శ్రేణులంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే ఫిర్యాదుపై నిర్ణయం తీసుకునేందుకు కూడా టీపీసీసీ వెనుకాడుతోందనే చర్చ జరుగుతుండడం గమనార్హం. కాగా మరోవైపు ఈ అసమ్మతి నేతలకు సీఎం సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి మద్దతు కూడా ఉందని, తన కుమారుడు కృష్ణభార్గవ్‌ రెడ్డి వేం కోసం పాలకుర్తిపై కన్నేసిన నరేందర్‌రెడ్డి ఇప్పటినుంచే జాగ్రత్త పడుతున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది.

జహీరాబాద్‌లో దామోదర వ్యూహం
ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జహీరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంపై దృష్టి పెటారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుంచి తన కుమార్తె త్రిషకు ఆయన టికెట్‌ అడిగే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే జహీరాబాద్‌ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌కు పొగ పెడుతున్నారని స్థానిక కాంగ్రెస్‌ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయనకు స్థానిక ఎంపీ సురేశ్‌ షెట్కార్‌ కూడా సహకరిస్తున్నారని తెలస్తుండగా, మరోవైపు ఆయన కూడా ఆ స్థానం తనకు కావాలని అడిగే ఆలోచనలో ఉన్నారని, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఈసారైనా ఎమ్మెల్యే కావాలనే వ్యూహంతో షెట్కార్‌ ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరి సహకారంతోనే మాజీ మంత్రి చంద్రశేఖర్‌పై ఫిర్యాదు చేసేందుకు స్థానిక కాంగ్రెస్‌ నేతలు గాంధీభవన్‌ వరకు వచ్చారని చెబుతున్నారు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement