అసలు వాళ్లు ఏపీ పోలీసులేనా?

Telangana Police Investigation On AP Police survey in Jagtial - Sakshi

ఎంత మంది వచ్చారు? ఎందుకొచ్చారు?

ఎన్ని రోజులుగా మకాం వేశారు?

ఎవరెవరిని కలిశారు?

ఇక్కడ వారికి ఆశ్రయం కల్పించిందెవరు?

ఎవరికైనా డబ్బులు పంపిణీ చేశారా? అనే కోణాల్లో తెలంగాణ పోలీసుల విచారణ

ఏపీ ఇంటెలిజెన్స్‌ సర్వేపై కూపీ లాగుతున్న పోలీసులు

16 మంది నుంచి వివరాలు సేకరించిన స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ

ముగ్గురికి టీడీపీ నేతలు ఆశ్రయం ఇచ్చినట్టు నిర్ధారణ

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బేరసారాలాడి అడ్డంగా దొరికిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఇపుడు పక్క రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ప్రజాధనంతో జీతాలు తీసుకుంటున్న ఏపీ పోలీసులను తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. తెలంగాణ ఎన్నికలపై ఇంటెలిజెన్స్ పోలీసుల ద్వారా సర్వే చేయిస్తున్నారు. ఈసీ ఆదేశాలతో విచారణ చేపట్టిన తెలంగాణ పోలీసులు చంద్రబాబు బండారాన్ని బట్టబయలు చేశారు.

జగిత్యాల జిల్లాలో ఏపీ ఇంటెలిజెన్స్‌ పోలీసుల సర్వే చేసిన ఘటనపై తెలంగాణ పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ నెల 27న ధర్మపురిలో ఏపీ ఇంటెలిజెన్స్‌ పోలీసుల సర్వేపై మంత్రి కేటీఆర్‌తోపాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ సీరియస్‌ అయ్యారు. జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. దీంతో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పోలీసు శాఖను ఆదేశించింది. వెంటనే రంగంలో దిగిన పోలీసులు సంఘటనపై నిజానిజాలు నిగ్గు తేల్చే పనిలోపడ్డారు. ఇందులో భాగంగా ఆదివారం ధర్మపురి పోలీస్‌స్టేషన్‌లో జగిత్యాల స్పెషల్‌ బ్రాంచ్‌ ఏఆర్‌ డీఎస్పీ సీతారాములు సుదీర్ఘ విచారణ చేపట్టారు. స్థానిక టీడీపీ, టీఆర్‌ఎస్‌ నాయకులతోపాటు మొత్తం 16 మందిని విచారణ చేశారు. ధర్మపురిలో అనుమానాస్పదంగా సర్వే నిర్వహిస్తూ స్థానికులకు చిక్కిన ముగ్గురు అసలు ఏపీ పోలీసులేనా? ఎంత మంది వచ్చారు? ఎందుకొచ్చారు? ఎన్ని రోజులుగా మకాం వేశారు? ఎవరెవరిని కలిశారు? ఇక్కడ వారికి ఆశ్రయం కల్పించిందెవరు? ఎవరికైనా డబ్బులు పంపిణీ చేశారా? అనే కోణాల్లో విచారణ నిర్వహించారు.

అనుమానాస్పదంగా తిరుగుతూ స్థానికులకు పట్టుబడ్డ ముగ్గురిలో ఒకరు వారం రోజులక్రితమే ధర్మపురికి వచ్చాడని.. నాలుగు రోజుల క్రితం మరో ఇద్దరు వచ్చారని స్థానికులు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. తర్వాత ముగ్గురూ భక్తులమని చెప్పుకుంటూ స్థానిక టీటీడీ ధర్మశాలలోనే మకాం వేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వీరికి స్థానిక టీడీపీ నాయకులు ఆశ్రయం కల్పించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆదివారం టీడీపీకి చెందిన పలువురిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించిన స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు.. సర్వే చేసిన ముగ్గురు వ్యక్తులకు వారు ఎలాంటి సహకారం అందించారన్నది ఆరా తీశారు. ఆ ముగ్గురు కొంతమందితో మాట్లాడినట్లు తెలుసుకుని ఓ హోటల్‌ యజమాని, ఇద్దరు కారు డ్రైవర్ల నుంచి కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టినట్టు తెలుస్తోంది. ఇందులో ఒకరు.. అనుమానాస్పద వ్యక్తి వద్ద ఓ సీల్డ్‌ కవర్‌ చూశానని చెప్పాడు. అదేంటని తాను అడిగితే మీకు సంబంధం లేదని అతను బదులిచ్చినట్లు ఆ వ్యక్తి పోలీసులకు వెల్లడించాడు.  

అయితే, ఈ ఘటనపై టీడీపీ సీనియర్‌ నేత ఒకరు వివరణ ఇస్తూ ‘భారత పౌరులెవరైనా, వారికి ఆశ్రయం ఇవ్వడంలో తప్పు లేదు. అయితే, వచ్చిన వాళ్లు ఇక్కడ ఏం సర్వే చేశారో మాకు తెలియదు. వారినే అడిగితే తెలుస్తుంది. మేం ఎవరికీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. ఆర్డర్‌ ఇవ్వలేదు. మాకు ఇతరులతో సర్వే చేయించుకోవాల్సిన అవసరం లేద’ని పేర్కొన్నట్టు సమాచారం. ధర్మపురిలో ఏపీ ఇంటెలిజెన్స్‌ పోలీసుల పర్యటనపై టీఆర్‌ఎస్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ ఘటనపై విచారణ చేపడుతున్నట్టు జగిత్యాల ఎస్పీ తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top