టీఆర్‌ఎస్‌ ఖతం..కాంగ్రెస్‌ గతం.. ఎంఐఎం హతం

Swamy Paripoornananda Slams KCR And Akbaruddin Owaisi - Sakshi

స్వామి పరిపూర్ణానంద

మలక్‌పేట: హిందుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న అక్బరుద్దీన్‌ ఒవైసీ పాకిస్తాన్‌కు పోవాలనీ.. సీఎం కేసీఆర్‌ బంగారు తెలంగాణగా మారుస్తాని చెప్పి కంగారు తెలంగాణగా మార్చారని స్వామి పరిపూర్ణానంద ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఖతం, కాంగ్రెస్‌ గతం, ఎంఐఎం హతం చేయడం తథ్యమన్నారు. మలక్‌పేట నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఆలె జితేంద్ర ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి మూసారంబాగ్‌ డివిజన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హైద్రాబాద్‌ పేరును భాగ్యనగరంగా మారుస్తామని స్వామి పరిపూర్ణనంద అన్నారు.

మలక్‌పేటలో కబ్జాలు, దౌర్జన్యాలు, దోపిడీలకు పాల్పడుతున్న మజ్లిస్‌ అభ్యర్థి బలాలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే నేరుగా మజ్లిస్‌కు వేసినట్లేనని అన్నారు.  నరేంద్ర మోదీ పాలనలో దేశంలో ఎక్కడ కూడా బాంబ్‌ పేళ్లుల్లు జరగలేదని, బాంబ్‌ పేల్చేవారిని దేశ సరిహద్దుల్లోనే పేల్చేశారన్నారు. తెలంగాణలో బీజేపీ గెలుపు చారిత్రక అవసరమన్నారు. కల్వకుంట్ల కుటుంబ పాలనను అంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 7న జరుగబోయే పోలింగ్‌ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొని కమలం గుర్తుకు ఓటే వేసి ఆలె జితేంద్రను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర కార్యదర్శి దేవేందర్, మలక్‌పేట కన్వీనర్‌ సంరెడ్డి సురేందర్‌రెడ్డి, పార్లమెంట్‌ కన్వీనర్‌ నర్సింహ, డివిజన్‌ అధ్యక్షుడు సురేందర్, విజయ్‌కాంత్, రమేశ్‌రెడ్డి, సహాదేవ్‌యాదవ్, యాదగిరెడ్డి, రమేష్‌గుప్తా పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top