‘చంద్రబాబు తప్పుడు లెక్కలు వేసుకున్నారు’ | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు తప్పుడు లెక్కలు వేసుకున్నారు’

Published Thu, Jun 20 2019 9:25 PM

Sujana Chowdary Press Meet After Joining BJP - Sakshi

న్యూఢిల్లీ : ఎన్నికల్లో ప్రజా నాడిని గమనించడం వల్లనే తాము బీజేపీలో చేరామని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తెలిపారు. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు రావడంపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తప్పుడు లెక్కలు వేసుకున్నారని అభిప్రాయపడ్డారు. గురువారం టీడీపీకి చెందిన మరో ముగ్గురు రాజ్యసభ సభ్యులతో కలిసి సుజనా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు రావద్దని తాను చంద్రబాబు నాయుడుకి చెప్పినట్టు వెల్లడించారు. కానీ ఆయన రాజకీయ వ్యుహం అంటూ ఎన్డీయేను వీడారని.. బహుశా చంద్రబాబు తప్పుడు లెక్కలు వేసుకున్నారని తెలిపారు. టీడీపీని వీడినందకు బాధగా ఉందని వ్యాఖ్యానించిన సుజనా.. టీడీపీకి తిరిగి పూర్వ వైభవం రావాలని కోరుకునే వ్యక్తుల్లో తాను మొదటివాడినని విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు.  ఎన్డీయేలో మూడున్నరేళ్లు మంత్రిగా పనిచేశానని.. ప్రధాని మోదీ పనితీరును దగ్గర నుంచి చూశానని అన్నారు.

ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమే..
రాష్ట్రానికి కేంద్రం ఎంత చేయగలదో అంత చేయడానికి నాటి కేంద్ర ప్రభుత్వం సిద్దపడిందని సుజనా గుర్తుచేశారు. ప్రత్యేక హోదా అనేది తన దృష్టిలో ముగిసిన అధ్యాయమని పేర్కొన్నారు. ఆర్థిక కేసులకు, రాజకీయాలకు సంబంధం లేదని అన్నారు. ఈ మధ్య కాలంలో తనపై వచ్చినవి కేవలం ఆరోపణలు మాత్రమేనని చెప్పారు. 

Advertisement
Advertisement