ఒక్కో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో రీపోలింగ్‌

 SEC has ordered repolling on 25th of this month for MPTC and ZPTC seats - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలంలోని పెదవీడు–2 ఎంపీటీసీ, మటంపల్లి జెడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 25న రీపోలింగ్‌నకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఆదేశించింది. ఈనెల 14న జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా గుర్రంబోడ్‌ తండా (పోలింగ్‌ స్టేషన్‌ :39)లో రహస్య ఓటింగ్‌కు ఆటంకం కలగడంతోపాటు ఒకరికి బదులు మరొకరు ఓటేయడం, ఓటింగ్‌ కంపార్ట్‌మెంట్‌లో ఒక ఓటరు ఉండగానే, మరొకరు ప్రవేశించడం, కొందరు రెండుసార్లు ఓటు వేయడం వంటి ఘటనలతో ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరగలేదని, ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ కూడా ఎన్నికలను సరిగా నిర్వహించడంలో విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.

ఈ పోలింగ్‌ స్టేషన్‌లో రిగ్గింగ్‌ జరిగినట్టు, చనిపోయిన వారి ఓట్లను కొందరు వేశారని, కొందరు ఓటేశాక బ్యాలెట్‌ పత్రాలను పోలింగ్‌ ఏజెంట్లకు చూపారని చిలకా కిషోర్‌కుమార్‌ అనే గ్రామస్తుడు ఎస్‌ఈసీకి చేసిన ఫిర్యాదుపై కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారులు, సాధారణ పరిశీలకుల నుంచి తీసుకున్న నివేదికల్లోనూ ఇదే అంశం స్పష్టమైందన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 14న సూర్యాపేట జిల్లాలోని పెదవీడు–2 ఎంపీటీసీ, మటంపల్లి జెడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నిక రద్దు చేస్తున్నట్టు ఎస్‌ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. 14న ఈ స్థానాల్లో (పోలింగ్‌ కేంద్రం–39) పోలైన బ్యాలెట్‌బాక్స్‌లను విడిగా భద్రపరచాలని, ఓట్లను లెక్కించరాదని స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top