ఢిల్లీ వేదికగా కేసీఆర్కు రేవంత్ సవాల్!
కేసీఆర్ ఎవర్నీ పట్టించుకోవడం లేదు
పత్రిక, చానల్ పెట్టి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు
రాహుల్ నాయకత్వంలో ఆయనపై పోరాడుతాం
ఢిల్లీలో రేవంత్రెడ్డి వ్యాఖ్యలు.. కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రజల జీవితాలు బాగుండాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆశించారని, అందుకే ఎలాంటి ప్రయోజనాలు చూడకుండా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని రేవంత్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రపదేశ్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా లెక్క చేయకుండా సోనియా తెలంగాణను ఇచ్చారని అన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఎవర్నీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
గత 40 నెలల్లో 3,400మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని, ఆయన కొడుకు మంత్రి అయ్యారని, కుటుంబంలోని నలుగురికి పదవులు వచ్చాయని విమర్శించారు. పత్రిక, చానెల్ పెట్టి రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణను వ్యతిరేకించిన వారితోనే కేసీఆర్ దోస్తీ చేస్తూ.. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచిపెడుతున్నారని దుయ్యబట్టారు. రాహుల్ నాయకత్వంలో కేసీఆర్కు వ్యతిరేకంగా పోరాడుతామని రేవంత్రెడ్డి అన్నారు. మరోవైపు రేవంత్రెడ్డితోపాటు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో హస్తం శ్రేణుల్లో ఉత్సాహం ఉరలెత్తుతోంది. ఇదే ఊపుతో ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నేతలు భావిస్తున్నారు.