అభినవ కాటన్‌ దొర వైఎస్‌ జగన్‌ : రాప్తాడు ఎమ్మెల్యే

Raptadu MLA Thopudurthi Prakash Reddy Praises CM YS Jagan - Sakshi

సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి  ప్రకాశ్‌రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీ ప్రయోజనాల కోసం సీఎం జగన్ చారిత్రక నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ఇచ్చిన హామీలను నిక్కచ్చిగా అమలు చేస్తున్నారని, తెలుగు రాష్ట్రాల సాగు, తాగు నీటి కష్టాలు తీర్చేందుకు ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ‘వైఎస్ జగన్ అభినవ కాటన్ దొర’ అని పేర్కొన్నారు. కరవు ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు ఆయన భగీరథ యత్నం చేస్తున్నారని తెలిపారు. గోదావరి-కృష్ణా జలాల సద్వినియోగం కరవు ప్రాంతాలకు మేలు చేస్తుందని చెప్పారు. ముఖ్యమత్రి జగన్‌, తెలంగాణ సీంఎం కేసీఆర్‌ చర్చలు తెలుగు ప్రజల నీటి కష్టాలు తీరుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. 

ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు దోపిడీ పాలన సాగించారని మండిపడ్డారు. దివంగత ముఖ్యమత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మొదలుపెట్టిన జలయజ్ఞాన్ని చంద్రబాబు నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు, టీడీపీ నేతలకు చిత్తశుద్ధి లేదని అన్నారు. టీడీపీ అవినీతి పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్‌ చేశారు. రాష్ట్రాభివృద్ధి గురించి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వైఎస్ జగన్‌కు సహకరించాలని హితవు పలికారు. గోదావరి నది నుంచి ప్రతి ఏటా మూడువేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి వెళ్తోందని గుర్తు చేశారు. వృథా నీటిని రైతులకు ఇస్తామంటే టీడీపీ నేతలకు ఎందుకు ఉలికిపాటు అని ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top