సంజీవయ్య సూపర్ విక్టరీ
రికార్డులు బద్దలుకొట్టిన కిలివేటి
పేట చరిత్రలో భారీ ఆధిక్యత
సాక్షి, నాయుడుపేట/సూళ్లూరుపేట: సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సూపర్ విక్టరీని నమోదుచేసుకుంది. చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య భారీ ఆధిక్యత సాధించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గురువారం జరిగిన ఓట్లు లెక్కింపులో ప్రారంభం నఉచి అత్యధిక మెజార్టీ కొనసాగింది. తొలి రౌండ్ నుండి మూడో రౌండ్ వరకు 3వేలు చొప్పున ఆధిక్యత సాధించారు. నాల్గొ రౌండ్లో కొంత మెజార్టీ తగ్గినా, ఐదవ రౌండ్ నుంచి 3వేలకు తగ్గకుండా మోజార్టీ జోరును పెంచింది. చివరి 21వ రౌండ్ వరకు మెజార్టీ ఆధిక్యతకు అడ్డేలేకుండా పోయింది.
ఏదశలోనూ టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి పరసా వెంకటరత్నం పోటీ ఇవ్వలేకపోయారు. పోస్టల్ బ్యాలెట్ లోనూ కిలివేటి హవా కొనసాగింది. టీడీపీ నియోజకవర్గంగా పేరున్న సూళ్లూరుపేట నియోజకవర్గంలో 1985లో టీడీపీ తరఫున పోటీచేసిన ఎం. మనెయ్య 28368 ఓట్లు మెజార్టీ సాధించారు., 1994లో 21001 ఓట్లు ఆధిక్యతలో పరసా వెంకటరత్నం విజయం సాధించారు. సూళ్లూరుపేటలో కిలివేటి విజయదుందుభీ మోగించడంతో పార్టీ క్యాడర్ ఆనందానికి హద్దేలేకుండా పోయింది.
1985 | ఎం. మణెయ్య మెజార్టీ | 28,368 ఓట్లు |
1994 | పరసా వెంకటరత్నం మెజార్టీ | 21.001 ఓట్లు |
ఈ విజయం చారిత్రాత్మకం : కిలివేటి సంజీవయ్య
సూళ్లూరుపేట నియోజకవర్గం ఆవిర్భవించిన నాటి నుంచి ఇంతటి ఘన విజయం ఇప్పటివరకు చరిత్రలో లేదు. ఇది చారిత్రాత్మక విజయం. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి, కష్టం ఫలితమే ఈ అపూర్వ విజయం. నియోజకవర్గంలో నాయకులు, యువత, కార్యకర్తలు పార్టీ కోసం చాలా కష్టపడి చేశారు. ఓటర్లకు నా ప్రత్యేక కృతజ్ఞతలు.