పోటీ విషయమై ప్రియా యూటర్న్‌

Priya Dutt Says She Will Contest For Lok Sabha Poll - Sakshi

సాక్షి, ముంబై : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అంశమై కాంగ్రెస్‌ మాజీ ఎంపీ ప్రియా దత్‌ యూటర్న్‌ తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని బుధవారం ప్రకటించారు. ‘నేను పోటీలో ఉన్నాను. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులతో తలపడబోతున్నా. నా పిల్లల భవిష్యత్తు కోసం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం నేను ఎన్నికల బరిలో దిగుతున్నా’  అని ఆమె వ్యాఖ్యానించారు. కాగా మహారాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ సంజయ్‌ నిరుపమ్‌తో విభేదాలు తలెత్తిన కారణంగా ప్రియా దత్‌తో పాటు.. ఆ పార్టీ నేత మిలింద్‌ డియోరా రాహుల్‌ గాంధీకి ఆయనపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి తనకు ఆసక్తిలేదని ఆమె రాహుల్‌కు లేఖ రాశారు.

ఈ నేపథ్యంలో పార్టీ ప్రయోజనాల దృష్ట్యా పోటీ చేయాల్సిందిగా రాహుల్‌ సూచించిన మేరకు ఆమె ఎన్నికల బరిలో దిగుతున్నట్లు సమాచారం. ఇక ప్రియా దత్‌... ప్రముఖ నటుడు, మాజీ కేంద్ర మంత్రి సునీల్‌ దత్‌ కుమార్తె అన్న విషయం తెలిసిందే. ముంబై నార్త్‌ వెస్ట్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2005(ఉప ఎన్నిక), 09 ఎన్నికల్లో విజయం సాధించిన ప్రియా దత్‌... 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పూనం మహజన్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆమె ఏఐసీసీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top