ఆ విషయం ఆయనకే తెలియదు !

MP Diwakar Reddy Counter To Sujana Chowdary - Sakshi

సాక్షి, అనంతపురం : టీడీపీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరీ వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి స్పందించారు. తనతో చంద్రబాబు మాట్లాడారో లేదో.. ఆయనకే తెలియదు అంటూ సుజనా చౌదరీని ఉద్దేశించి మాట్లాడారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తాను పార్లమెంట్‌కు వెళ్లటం లేదని స్పష్టం చేశారు. తనతో ఎవరూ చర్చలు జరపలేదన్నారు. తాను ఎలాంటి డిమాండ్లు పెట్టలేదని తెలిపారు. టీడీపీ అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని, మోదీ సర్కార్‌కు సంపూర్ణ మెజార్టీ ఉందని మరోసారి పునరుద్ఘాటించారు.

అంతకుముందు లోక్‌సభలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవటం ఖాయమంటూ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సుజనా చౌదరీ స్పందిస్తూ.. టీడీపీ పార్లమెంటరీ పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని చెప్పుకొచ్చారు. జేసీ దివాకర్ రెడ్డి తమ పార్టీలో సీనియర్ నేత అని, ఆయన పార్టీపై అసంతృప్తిగా ఉన్నారని మీడియా ద్వారానే తాను చూశానని తెలిపారు. గురువారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఈ రోజు కూడా  ఆయనతో తాను మాట్లాడానని చెప్పారు. తన సోదరుడి ఆరోగ్యం బాగాలేనందునే పార్లమెంటుకు రాలేకపోయానని తనతో జేసీ చెప్పారని తెలిపారు. పార్టీపై ఆయనకు ఏమైనా అసంతృప్తి ఉంటే.. అది మాతో చెబితే చర్చించుకుని సరి చేసుకుంటామన్నారు. రేపటి (శుక్రవారం) అవిశ్వాస తీర్మానం చర్చకు జేసీ పార్లమెంటుకు హాజరు అవుతారని భావిస్తున్నట్టు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు జేసీతో మాట్లాడుతున్నారని సుజనా మీడియాకు తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top