‘కమలహాసన్‌ హిందువుల ద్రోహి’

Makkal Neethi Maiyam Against Hindus Says BJP - Sakshi

పెరంబూరు: కమలహాసన్‌ స్థాపించిన మక్కళ్‌ నీది మయ్యం హిందువుల ద్రోహి పార్టీ అని బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్‌.రాజా ఆరోపించారు. కేరళలోని శబరిమలలో అయ్యప్ప దేవాలయానికి వయసు బేధం చూడకుండా అందరు స్త్రీలను అనుమతించాలని సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ ఆ తీర్పును అమలు పరస్తూ మహిళలను అయ్యప్పస్వామి ఆలయ దర్శనానికి చర్యలు తీసుకుంటోంది. అయితే అక్కడి అయ్యప్ప భక్తుల సంఘాలతో పాటు, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు అందుకు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

దీంతో కొన్ని రోజులుగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఈ వ్యవహారాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ పట్టించుకోవడం లేదంటూ ప్రధానమంత్రి నరేంద్రమోది విమర్శలు చేశారు. ఇదే విధంగా తమిళనాడులోనూ బీజేపీ నాయకులు, ఇతర హిందు సంఘాలు శబరిమల వ్యవహారంపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మక్కళ్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌ స్పంధిస్తూ శబరిమల వ్యవహారంలో కేరళ ప్రభుత్వాన్ని తప్పు పట్టకూడదని పేర్కొన్నారు. దీంతో కమలహాసన్‌ వ్యాఖ్యల్ని బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్‌.రాజా తీవ్రంగా ఖండించారు.

ఆయన శనివారం తన ట్విట్టర్‌లో పేర్కొంటూ శబరిమల వ్యవహారంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టకూడదట, సుప్రీంకోర్టు తీర్పును అమలు పరచాలనికమలహాసన్‌ అంటున్నారు. అలాగైతే 2017లో ప్రవం చర్చ్‌ వ్యవహారంలో న్యాయస్థానం తీర్పును పినరాయి విజయన్‌ ప్రభుత్వం ఎందుకు అమలు పరచలేదు. ఈ విషయం గురించి ప్రశ్నించే ధైర్యం కమలహాసన్‌కు ఉందా మొత్తం మీద మక్కళ్‌ నీది మయ్యం హిందువుల ద్రోహి పార్టీ  అని హెచ్‌.రాజా తీవ్రంగా విమర్శించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top