నవంబర్ 3న ఏం తేలబోతుంది? | Hardik Dead Line to Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు హర్దిక్‌ డెడ్‌లైన్‌

Oct 28 2017 5:03 PM | Updated on Mar 18 2019 9:02 PM

Hardik Dead Line to Congress - Sakshi

అహ్మదాబాద్ : పటీదార్‌ ఉద్యమానికి మద్ధతు ప్రకటించి.. అత్యధిక సీట్లను కేటాయిస్తేనే కాంగ్రెస్ పార్టీతో జత కలుస్తానని హర్దిక్‌ పటేల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వచ్చే నెలలో సూరత్‌ సభలో హర్దిక్‌ రాహుల్‌తో వేదిక పంచుకుంటారంటూ కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటనలో తెలియజేసింది. 

ఈ నేపథ్యంలో హర్దిక్ తన ట్విట్టర్‌లో ఓ ట్వీట్ చేశారు. తమ డిమాండ్లపై స్పష్టమైన హమీ ఇస్తేనే కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలుపుతామని చెప్పాడు. నవంబర్ 3లోగా దానిపై ఓ ప్రకటన చేయాలని లేనిపక్షంలో గతంలో అమిత్‌షా సూరత్ పర్యటన సందర్భంగా ఎదురయిన పరిణామాలే పునరావృతం అవుతాయని ట్వీట్‌లో పరోక్షంగా వారించాడు.  

గత నెలలో సూరత్ లో అమిత్‌ షా నిర్వహించిన సమావేశం రసాభాసంగా మారింది. పటీదార్‌ ఉద్యమ మద్దతుదారులు ఫర్నీఛర్ నాశనం చేసి నానాబీభత్సం సృష్టించారు. గతంలోనే చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ హర్దిక్ డిమాండ్లకు ఓకే చెప్పింది. హర్దిక్ కూడా గజదొంగలను గద్దెదించేందుకు దొంగలకు మద్దతు ఇవ్వటంలో తప్పులేదని బీజేపీ, కాంగ్రెస్‌లను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు కూడా. అయితే ఎటొచ్చి రిజర్వేషన్ కోటా శాతం, ఎన్నికల్లో సీట్ల కేటాయింపు విషయంలోనే ప్రతిష్టంబన ఏర్పడింది.

హర్దిక్ డిమాండ్లలో కొన్ని.. 

- ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ సామాజిక వర్గానికే ఎక్కువ టికెట్లు ఇవ్వాలని హార్దిక్‌ కోరినట్లు తెలిసింది. 
-  కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థాగత నిర్మాణంలో పటేళ్ల ప్రాతినిధ్యం పెంచాలి. 
- పటేళ్ల రిజర్వేషన్ల అమలుపై న్యాయసమీక్ష లేకుండా రాజ్యాంగ భద్రత కల్పించాలి.
- ప్రస్తుత రిజర్వేషన్లకు భంగం కలిగించకుండా పటేళ్లకు వేరుగా రిజర్వేషన్‌ ఇవ్వాలి. 

వీటితోపాటు పటీదార్‌ ఆందోళన సందర్భంగా తమ వర్గం వారిపై దౌర్జన్యం చేసిన పోలీసు అధికారులపైనా చర్యలు తీసుకోవాలని హార్దిక్‌ పటేల్‌ కోరినట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement