
సాక్షి, అమరావతి: కరోనా వైరస్లా రాష్ట్రానికి చంద్రన్న వైరస్ పట్టిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... చంద్రన్న వైరస్కు ఆయన బతికున్నంత కాలం మందు దొరకదని విమర్శించారు. చంద్రబాబు ఎక్కడుంటే అక్కడ నాశనం, వినాశనం, విధ్వంసం అని పేర్కొన్నారు. విశాఖ భూ కుంభకోణంలో టీడీపీ తమపై రాద్ధాంతం చేస్తోందని.. టీడీపీ హయాంలోనే వేల ఎకరాలు కబ్జా అయ్యాయని పేర్కొన్నారు. లేనిపోని ఆరోపణలతో బురదచల్లేందుకు టీడీపీ యత్నిస్తుందని అమర్నాథ్ మండిపడ్డారు.
ప్రజలకు వాస్తవాలు తెలియజేసే ఆలోచన టీడీపీకి లేదని ధ్వజమెత్తారు. నిజ నిర్థారణ కమిటీ విశాఖలో కాదని.. అమరావతిలో వేసుకోవాలన్నారు. ‘చంద్రబాబుకు అన్ని జిల్లాల అభివృద్ధి అవసరం లేదా.. కేవలం 3 గ్రామాల అభివృద్ధే కావాలా..? విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్పై టీడీపీ స్టాండ్ ఏమిటీ’ అని ప్రశ్నించారు. సిగ్గు లేకుండా టీడీపీ నేతలు తమపై ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు ఏ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఇష్టం లేదన్నారు. విశాఖ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని తప్పుడు ప్రచారాలు చేసి ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలపై విషం కక్కుతారా అంటూ అమర్నాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.