డౌటే లేదు.. నేనే సీఎం: ఫడ్నవిస్‌ | Devendra Fadnavis Says He Will Be The Maharashtra Next CM | Sakshi
Sakshi News home page

డౌటే లేదు.. నేనే సీఎం: ఫడ్నవిస్‌

Oct 29 2019 1:32 PM | Updated on Oct 29 2019 2:42 PM

Devendra Fadnavis Says He Will Be The Maharashtra Next CM - Sakshi

ముంబై : అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మహారాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికలకు ముందే కూటమిగా బరిలోకి దిగిన బీజేపీ- శివసేనల మధ్య ఫలితాల అనంతరం విభేదాలు తలెత్తాయి. దీంతో రాజకీయ సమీకరణల్లో శరవేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఇరు పక్షాలకు సీట్లు తగ్గగా.. ఎన్సీపీ-కాంగ్రెస్‌ పార్టీలు పుంజుకుని అధికార పార్టీకి గట్టి షాక్‌నిచ్చాయి. ఇక ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసిన బీజేపీకి శివసేన చుక్కలు చూపిస్తోంది. రెండున్నరేళ్లు సీఎం పదవి తమకు కేటాయించడంతో పాటు కేబినెట్‌లోనూ తగిన ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్‌ చేస్తోంది. అంతేకాదు ఎన్సీపీ- కాంగ్రెస్‌లతో జట్టుకట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లుగా సంకేతాలు జారీ చేస్తోంది.(చదవండి : ‘ఇది మహారాష్ట్ర. ఇక్కడ ఎవరి తండ్రి జైళ్లో లేరు’)

ఈ క్రమంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ తానే మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నట్లు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ... ‘ శివసేన ఐదేళ్ల పాటు సీఎం పదవి తమకే దక్కాలని ఆశిస్తుంది. కోరుకున్నవన్నీ జరగవు. ముఖ్యమంత్రి పీఠంపై మేమెప్పుడూ 50:50 ఫార్ములా పాటిస్తామని వారికి హామీ ఇవ్వలేదు. ఇది కాకుండా వాళ్లు వేరే డిమాండ్లతో రావాలి. అప్పుడు చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం. ఇక బీజేపీ నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందనేది సుస్పష్టం. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కాబోయే ముఖ్యమంత్రిని నేనే. ప్లాన్‌ బీ, ప్లాన్‌ సీ ఏవీ ఉండవు. ప్లాన్‌ ఏ మాత్రమే వర్కవుట్‌ అవుతుంది. బుధవారం బీజేపీ శాసన సభా పక్షనేత ఎన్నిక జరుగుతుంది. మాకు పది మంది స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అలాగే మరో ఐదుగురు కూడా మాకు మద్దతు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారు’ అని శివసేన ఆశలపై నీళ్లు చల్లారు. కాగా గురువారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 105 స్థానాలు కైవసం చేసుకోగా.. శివసేన 56 సీట్లలో విజయం సాధించింది.  

Advertisement
 
Advertisement
Advertisement