ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం  | Criminal negligence of the government | Sakshi
Sakshi News home page

ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం 

Nov 11 2017 3:28 AM | Updated on Mar 18 2019 9:02 PM

Criminal negligence of the government - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న వరవరరావు, ప్రొఫెసర్‌ హరగోపాల్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రొఫెసర్‌ సాయిబాబా విషయంలో ప్రభుత్వం నేరపూరిత నిర్లక్ష్యం వహిస్తోందని విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు ఆరోపించారు. టీవీవీ, ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల నేతృ త్వంలో ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వరవరరావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. దేశంలో నిత్యం దోపిడీకి గురవుతున్న దళితులు, ఆదివాసీ లు, అణగారిన వర్గాలవారి పక్షాన మాట్లాడాడు కనుకనే సాయిబాబా పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తోందని చెప్పారు.

ప్రజలను ఓటర్లుగా, ఓటర్లను సంస్కరణల పేరుతో బిచ్చగాళ్లుగా మార్చిన ప్రభుత్వం.. సాయిబాబా లాంటి యుద్ధఖైదీనీ బిచ్చగాడిగా మార్చేస్తోందని మండి పడ్డారు. సాయిబాబా జైలు నుంచి రాసిన లేఖను ప్రస్తావిస్తూ సాయిబాబా కేసును వాదించేందుకు మొదట సుప్రీంకోర్టు న్యాయవాది రాంజెఠ్మలానీని నిశ్చయించుకున్నామని, ఆయన అనారోగ్య మో, ప్రభుత్వ ఒత్తిడి కారణంగానో మనుషులను గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో సాయిబాబా నిర్ణయం ప్రకారం గాడ్లింగ్‌ అనే మరో సీనియర్‌ న్యాయవాదికి అప్పగించామని చెప్పారు.  సాయి బాబా మావోయిస్టు పార్టీ అభిప్రాయాలను సమర్థిస్తున్న ఏకైక కారణంగా ఏ నేరం చేయకుండానే జైలుపాల్జేశారన్నారు. 

ఆ భావజాలం కలిగి ఉండటం నేరం కాదు.. 
ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడుతూ.. మావోయిస్టు భావజాలాన్ని కలిగి ఉండటం నేరం కాదన్నారు. విశ్వాసాలను నిషేధించలేరని, మావోయిస్టు అభిప్రాయాలు కలిగి ఉండటాన్ని తప్పుబట్టే అప్రజాస్వామిక భావజాలాన్ని ప్రజాస్వామికవాదులంతా వ్యతిరేకించాలన్నారు. దీనిపై వర్సిటీలు, బాహ్యసమాజంలో విస్తృత చర్చ జరగాలన్నారు. సాయిబాబాతో పాటు మిగిలిన రాజకీయ ఖైదీలు, ఆదివాసీల విడుదలకు ఉద్యమిం చాల్సిన అవసరం పౌరసమాజంపై ఉందన్నారు. 

జైల్లో ఉండటంతో బతికిపోయారు 
జైల్లో ఉన్నారు కనుకనే సాయిబాబా బతికున్నారని, బయట ఉన్న కల్‌బుర్గి, గోవింద్‌ పన్సారే, గౌరీ లంకేశ్‌లను చంపేశారని సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ చెప్పారు. మెరుగైన విద్యావిధానం, భావసంఘర్షణ, మార్పుకోసం పనిచేస్తోన్న సాయిబాబా గొంతును మావోయి స్టు పేరుతో నొక్కేయడం అన్యాయమని కాకతీయ వర్సిటీ ప్రొ.కాత్యాయినీ విద్మహే అన్నారు. అకడమిక్‌ స్వేచ్ఛ కోసం, సాయిబాబా విడుదల కోసం జరిగే పోరాటంలో అందరం భాగస్వాము లం కావాలని హెచ్‌సీయూ ప్రొ.లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.

సాయిబాబా సహా అన్యాయంగా జైళ్లలో మగ్గుతున్న వారిని గురించి మాట్లాడాల్సిన బాధ్యత సమాజంపై ఉందని పాత్రికేయురాలు మాలినీ సుబ్రహ్మణ్యం చెప్పారు. సాయిబాబాకి తక్షణం వైద్యం అందించాలని హైకోర్ట్‌ న్యా యవాది నందిగామ కృష్ణారావు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సాయిబాబా విడుదల కమిటీ నాయకుడు రవీందర్, విరసం సభ్యుడు రవిచంద్ర, న్యూడెమోక్రసీ నాయకులు డీవీ కృష్ణారెడ్డి, అచ్యుతరామారావు, సీపీఎం నాయకుడు నరసింహరావు, కాంగ్రెస్‌ నాయకులు బెల్లయ్య నాయక్, జహీర్, అరుణోదయ విమలక్క, రచ యిత పింగళి చైతన్య, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సమున్నత, కోటా శ్రీనివాస్, రెహమాన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement