టీఆర్‌ఎస్‌ గెలిస్తే ప్రజలకు లాభం | Court Ruling On Municipal Polls On Thursday Says KTR | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ గెలిస్తే ప్రజలకు లాభం

Sep 26 2019 3:53 AM | Updated on Sep 26 2019 5:16 PM

Court Ruling On Municipal Polls On Thursday Says KTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘కాంగ్రెస్‌ గెలిస్తే ఉత్తమ్‌కు లాభం... టీఆర్‌ఎస్‌ గెలిస్తే ప్రజలకు లాభం’ అనే నినాదంతో హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్తామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మున్సిపల్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలో ట్రక్కు గుర్తు మూలంగా సాంకేతికంగా ఓటమి పాలైన సైదిరెడ్డికి మరోమారు ప్రస్తుత ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా అవకాశమిచ్చామన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణభవన్‌లో బుధవారం మీడియాతో కేటీఆర్‌ మాట్లాడారు. ‘తాజాగా ఓ సంస్థ హుజూర్‌నగర్‌లో 1,700 మంది సేకరించిన సర్వే వివరాల ప్రకారం మేము కాంగ్రెస్‌పై 14% ఓట్ల ఆధిక్యంలో ఉన్నాం. టీఆర్‌ఎస్‌ పట్ల 54.64 శాతం, కాంగ్రెస్‌కు 42, బీజేపీకి 2.55, ఇతరులకు 0.71 శాతం మంది ఓటర్లు మొగ్గు చూపుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. పోలింగ్‌ నాటికి మా గ్రాఫ్‌ ఎంత పెరుగుతుందో ఇప్పుడే చెప్ప లేం. 10 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్‌ గెలిస్తే.. సీఎం, డిప్యూటీ సీఎం అవుతారని ప్రజలు మొగ్గు చూపారు. అప్పటితో పోలిస్తే కాంగ్రెస్‌ మరింత అధోగతి పాలైంది. బీజేపీ ఎక్కడో సుదూ రంగా మూడో స్థానంలో ఉంది’ అని అన్నారు.  

మున్సిపల్‌ ఎన్నికలపైనే..
మున్సిపల్‌ ఎన్నికలపై గురు వారం కోర్టు తీర్పు వెలువడే అవకాశ ముందని కేటీఆర్‌ చెప్పారు. ‘నాతో సహా అందరం మున్సిపల్‌ ఎన్నికల మీద పడతాం. అందుకే ఎమ్మెల్యేలకు కాకుండా ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర నేతలకు హుజూర్‌నగర్‌ బాధ్యతలు అప్పగిస్తున్నాం. మున్సిపల్‌ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ‘ఎవరి ఇల్లు వారు కాపాడుకోవాలి’. అంతా దృష్టి కేంద్రీకరించి గెలుపొందాలని అను కుంటున్నాం’ అని కేటీఆర్‌ అన్నారు.

బాధ్యత గల మంత్రిగా స్పందించా..
‘అమీర్‌పేట్‌ మెట్రోస్టేషన్‌లో ప్రమాదంపై బాధ్యత గల మంత్రిగా ఎల్‌ అండ్‌ టీ, మెట్రోరైలు ఎండీతో మాట్లాడి.. సాంత్వన చేకూరేలా చూడాలని ఆదేశిం చా. మెట్రో పిల్లర్ల పరిస్థితిని తనిఖీ చేయమని ఆదేశించడంతో పాటు, దర్యాప్తు చేసి నివేదిక ఇచ్చే బాధ్యతను స్వతంత్ర సంస్థకు అప్పగించమని చెప్పా. వర్షాల వల్ల కొన్ని చోట్ల పార్టీ భవనాల నిర్మాణం ఆలస్యం జరుగుతోంది. పార్టీ అధినేతతో చర్చించి త్వరలో పార్టీ జిల్లా, రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేస్తాం..’ అని కేటీఆర్‌ వెల్లడించారు.

టార్గెట్‌ ‘హుజూర్‌నగర్‌’!
హుజూర్‌నగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఎలాగైనా విజయం సాధించా లనే పట్టుదలతో ఉన్న టీఆర్‌ఎస్‌.. ప్రచార వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రత్యేక దృష్టి సారిం చిన పార్టీ అధినేత కేసీఆర్‌.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ బుధవారం పార్టీ ఇన్‌చార్జీల తో సమావేశమయ్యారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు భేటీలో ఉన్నారు. హుజూ ర్‌నగర్‌ పరిధిలోని 7 మండలాలు, 2 మున్సిపాలిటీలకు పార్టీ పక్షాన 50 మంది ఇన్‌చార్జీలను నియమించిన కేటీఆర్‌.. అనుసరించాల్సిన వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశం ముగిశాక అదే నియోజకవర్గం పరిధిలోని పాలకీడు కాంగ్రెస్‌ జెడ్పీటీసీ సభ్యుడు మాలోత్‌ బుజ్జి టీఆర్‌ఎస్‌లో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 5 జెడ్పీటీసీ, 4 ఎంపీపీ స్థానాలు గెలుపొందిన టీఆర్‌ఎస్‌ తాజాగా కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధుల చేరికలపై దృష్టి పెట్టింది.

టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతా : శంకరమ్మ
‘హుజూర్‌నగర్‌లో పోటీ చేయాల్సిందిగా నన్ను బీజేపీ కోరిన మాట వాస్తవమే.. ఓ దశలో నేను కూడా వెళ్లాలనుకున్నా. నా కుమారుడు శ్రీకాంత్‌ పదవుల కోసం ప్రాణ త్యాగం చేయలేదు. తెలంగాణ రాష్ట్రం కోసమే ప్రాణాలు అర్పించాడు. నా కొడుకు ఆశయ సాధన కోసం విలువలకు కట్టుబడి టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతా..’ అని తెలంగాణ ఉద్యమంలో ఆత్మాహుతి చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ స్పష్టంచేశారు. బుధవారం ఆమె మంత్రి జగదీశ్‌ రెడ్డితో కలసి తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌తో భేటీ అయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement