షాకింగ్‌ సర్వే.. బీజేపీకి కష్టమే | Congress Will Better its 2013 Tally, Predicts Survey | Sakshi
Sakshi News home page

షాకింగ్‌ సర్వే.. బీజేపీకి కష్టమే

Mar 26 2018 2:13 PM | Updated on Mar 18 2019 9:02 PM

Congress Will Better its 2013 Tally, Predicts Survey - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక తిరిగి కాంగ్రెస్‌ పార్టీ గుప్పిట్లోనే ఉంటుందా? ఈసారి ఎలాగైనా గద్దెనెక్కాలని భావిస్తున్న కమలనాథులకు ఆశలకు గండిపడనుందా? అంటే తాజాగా వెలుగులోకి వచ్చిన సర్వే అవుననే చెబుతోంది. కాంగ్రెస్‌ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం మాత్రమే కాకుండా తనకు సీట్లను కూడా పెంచుకోనుందట. మొత్తం 224 ఎమ్మెల్యే స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్‌ దాదాపు 126 సీట్లు దక్కించుకోనుందని ఆ సర్వే తెలిపింది. ఓటర్ల షాతం కూడా కాంగ్రెస్‌కు అమాంతం పెరిగిపోనుందట. వివరాల్లోకి వెళితే.. గతంలో 2013 సమయంలో కూడా సర్వే నిర్వహించి ఎన్నికల ఫలితాలు ముందే ఊహించి చెప్పిన సీ-ఫోర్స్‌ అనే సంస్థ తాజాగా మార్చి 1 నుంచి 25 వరకు సర్వే నిర్వహించింది. దాదాపు 154 నియోజకవర్గాల్లో 22,357మంది ఓటర్ల వద్ద ఆరా తీసింది.

అదే సందర్భాల్లో 2,368 పోలింగ్‌ బూత్‌ పరిధి ప్రాంతాలను కూడా వారు కవర్‌ చేశారు. మొత్తం 326 పట్ణణ ప్రాంతాల్లో, 977 గ్రామీణ ప్రాంతాల్లో కూడా సర్వే చేశారు. అనంతరం ఆ నివేదిక వెల్లడిస్తూ తాము చెప్పిన ఫలితాల్లో ఒక శాతం అటూఇటూ తప్ప దాదాపు సరిగ్గా ఉండబోతుందని జోస్యం చెప్పింది. ఈ సర్వే కాంగ్రెస్‌ పార్టీనే చేయించినట్లు తెలుస్తోంది. 2013 కూడా సీ ఫోర్‌ అనే సంస్థ సర్వే చేసి ఆ సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీకి 119 నుంచి 120సీట్లు వస్తాయని చెప్పగా చెప్పిన ప్రకారమే 122 స్థానాలు దక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.

అయితే, ఈసారి కాంగ్రెస్‌ 126 స్థానాలు దక్కించుకుంటుందని, గతంతో పోలిస్తే నాలుగు స్థానాలు పెరుగుతాయని తెలిపింది. అంతేకాకుండా కాంగ్రెస్‌కు మొత్తం 9శాతం ఓట్లు పెరుగుతాయని, 46శాతం ఓట్లు కొల్లగొడుతుందని, అదే సమయంలో బీజేపీకి 31శాతం ఓట్లు, జేడీఎస్‌కు 16శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. ఇతరుకు మాత్రం ఒక సీటు వచ్చే అవకాశం ఉందని, వారికి 7శాతం ఓట్లు వెళతాయని తెలిపింది. ఈసారి బీజేపీకి 70 సీట్లు దక్కుతాయని వెల్లడించింది. గతంతో పోలిస్తే 30 సీట్లు అదనం అని పేర్కొంది. జేడీఎస్‌ మాత్రం కర్ణాటకలో గతంలో కంటే దారుణంగా దెబ్బతింటుందని వివరించింది.

Advertisement
 
Advertisement
Advertisement