కాళేశ్వరంపై వాస్తవాలను బయటపెట్టాలి : భట్టి
న్యూఢిల్లీ : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర, దేశ ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టు డీపీఆర్ను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరితే ఇంతవరకు బయటపెట్టలేదన్నారు. ప్రాజెక్టు సమగ్ర సమాచారం వెబ్సైట్లో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టామన్నారు. 15 శాతం నిర్మాణానికే రూ.50 వేల కోట్లు ఖర్చయితే మొత్తం ప్రాజెక్టు పూర్తికావడానికి ఎన్ని లక్షల కోట్లు కావాలని భట్టి ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై వాస్తవాలను దాచే ప్రయత్నం చేస్తున్నారని భట్టి మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో 70 శాతం పూర్తయిన ప్రాజెక్టులకు అడ్డుపడి తెలంగాణ ప్రాంతానికి గోదావరి నీళ్లు రాకుండా చేసింది కేసీఆరే అని ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టు కోసం ఏం త్యాగం చేశారని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ను ఆహ్వానించారని ప్రశ్నించారు. తెలంగాణ ఖజానాపై ఆర్థికభారం పడేలా వ్యవహరించిన వ్యక్తి ఫడణవీస్ అన్నారు. నిజాలు బయటికి వస్తాయనే ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన అన్ని పార్టీలను పిలవలేదని భట్టి మండిపడ్డారు.
సంబంధిత వార్తలు