
మిర్యాలగూడ: ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కాంగ్రెస్ పార్టీ చైతన్య యాత్రను పార్టీ నాయకులంతా ఐక్యంగా ఉండి నిర్వహిస్తారని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో విలేకరులతో మాట్లాడుతూ చైతన్య యాత్ర రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో సాగుతుందని చెప్పారు. ప్రభుత్వం విస్మరించిన హామీలు, ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైన తీరుతోపాటు కాంగ్రెస్ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను కూడా తెలుసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలలో డబుల్బెడ్ రూమ్ ఇళ్ల పథకం, ఇళ్లు నిర్మించుకున్న వారికి బిల్లుల మంజూరు, రుణమాఫీపై ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోవడం వల్ల రైతులకు వడ్డీల భారం అయిందని, ఇలా చెప్పుకుంటూ పోతే 50 హామీలు విస్మరించారని అన్నారు. అధికారం పోతుందని టీఆర్ఎస్ నాయకులు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. సంస్కార హితంగా, ప్రజాహితంగా, వాస్తవ పరిస్థితులను అర్ధం చేసుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుందని హితవు పలికారు.