కేసీఆర్ మాటలు బాధించాయి
కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్య
సాక్షి, అమరావతి: అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్తో తెలంగాణకు పోలిక లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధించాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రెండవ రోజు శుక్రవారం నాడు కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ తెలంగాణను ఆంధ్ర పాలకులు ధ్వంసం చేశారని అనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించడం వల్ల ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.
ఒక ఇల్లును పార్టిషన్ చేసినప్పుడు కూడా వివిధ రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని, ఆవిధంగా ఆలోచించకుండా రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్లు విభజించారన్నారు. 1995 ముందు, 1995 తర్వాత హైదరాబాద్ అభివృద్ధిని గమనిస్తే వాస్తవాలు ఏమిటో తెలుస్తాయన్నారు. విభజన గాయం నుంచి కోలుకోవడానికి నవ నిర్మాణ దీక్ష, మహాసంకల్పంతో అందరిలో చైతన్య స్ఫూర్తిని రగిలిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం ఇప్పుడిప్పుడే సమస్యల నుంచి బయటపడుతోందని, మిగిలిన రాష్ట్రాలతో పోటీపడే స్థాయికి చేరాలంటే ముందు నిలదొక్కుకోవాల్సి వుందని పేర్కొన్నారు.