తీర్పు తర్వాత ఆకాశ రామన్న లేఖ!

Chandrababu once again plans to manage the constitutional systems  - Sakshi

ఎస్‌ఈసీ రమేశ్‌ పేరుతో హఠాత్తుగా తెరపైకి..

సుప్రీం తీర్పుతో బాబులో కలవరం

ప్రభుత్వంపై దుష్ప్రచారానికి కొత్త పన్నాగం

అధికారికంగా స్పందించని ఎన్నికల కమిషనర్‌

సాక్షి, అమరావతి: ఎన్నికల నియమావళిని నిరవధికంగా కొనసాగించి ప్రభుత్వ వ్యవస్థలను పరోక్షంగా గుప్పిట్లో పెట్టుకోవాలన్న పన్నాగం బెడిసికొట్టడంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు మరో కుట్రకు తెరతీశారు. చంద్రబాబు తనకు అలవాటైన రీతిలో రాజ్యాంగ వ్యవస్థలను మేనేజ్‌ చేసేందుకు మరోసారి ఎత్తుగడ వేశారు. సుప్రీంకోర్టు బుధవారం వెల్లడించిన తీర్పు తమకు శరాఘాతంగా మారడంతో నిమ్మగడ్డ రమేష్‌ పేరుతో టీడీపీ కుయుక్తికి పాల్పడింది. 

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ కేంద్ర హోంశాఖకు రాసినట్లుగా చంద్రబాబు స్క్రిప్టు ప్రకారం బుధవారం సాయంత్రం హఠాత్తుగా ఓ లేఖ తెరపైకి వచ్చింది. అదీ టీడీపీ అనుకూల టీవీ చానళ్ల చేతికే మొదట అందింది. 
ఆ లేఖ రమేశ్‌ కుమార్‌ రాశారో లేదో స్పష్టం కాలేదు కానీ తమ అనుకూల టీవీ చానళ్లతోపాటు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యేలా టీడీపీ చేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా హింసాత్మక సంఘటనలు ఎక్కువగా జరిగాయని ఆ లేఖలో ఉంది.
ఎన్నికల్లో అక్రమాలు, డబ్బు, మద్యం ప్రభావాన్ని పూర్తిగా అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ ఉద్దేశాలను లేఖలో తప్పుబట్టారు.
తనకు, తన కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖను రమేశ్‌ కుమార్‌ కోరినట్లు లేఖలో ఉంది.
– కరోనా వైరస్‌ ప్రభావంతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు రమేశ్‌కుమార్‌ అధికారికంగా ప్రకటించారు. సుప్రీంకోర్టుకు కూడా అదే నివేదించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉందనిగానీ, ఏకగ్రీవ ఎన్నికలపై సందేహాలు గానీ వ్యక్తం చేయలేదు. 
 – ఎన్నికల కమిషనర్‌ పేరుతో వైరల్‌ అయిన లేఖలో కరోనా వైరస్‌ ప్రస్తావనే లేదు. శాంతి భద్రతలపై సందేహాలు, ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. అదే నిజమైతే మరి సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలో ఆ అంశాన్ని ఎందుకు ప్రస్తావించ లేదు? 
– ఇక ఏకగ్రీవాలపై సందేహాలు నిరాధారమన్నది తేటతెల్లమవుతోంది. 2019 ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లు, 86 శాతం సీట్లు సాధించి అధికారం చేపట్టిన ఈ 9 నెలల్లో ప్రజలు మెచ్చేలా పాలన అందించడంతో ప్రభుత్వంపై ఆదరణ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు పెరగడంలో ఆశ్చర్యం ఏమీలేదని నిపుణులు చెబుతున్నారు.  
– ఈ లేఖపై ‘సాక్షి’ ప్రతినిధి వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషన్‌ ప్రతినిధి స్పందించకపోవడం గమనార్హం. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top