చింతమనేనికి చంద్రబాబు మద్దతు!

chandrababu naidu Silence on tdp mla Chintamaneni comments - Sakshi

సాక్షి, అమరావతి : మొన్న తహసిల్దార్‌ వనజాక్షిపై దాడి, నిన్న దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండ పుష్కలంగా ఉందనేది మరోసారి రుజువు అయింది. ఎమ్మెల్యే తీరుపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద  ఎత్తున నిరసనలు, విమర్శలు వెల్లువెత్తుతున్నా...ముఖ్యమంత్రికి మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేదు. ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే చింతమనేనిని చంద్రబాబు కనీసం మందలించడం కూడా జరగలేదు. పైపెచ్చు పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో దళితులు పదవులకు పనికిరారన్న చింతమనేనని సీఎం సమర్థించడం గమనార్హం. 

అంతేకాకుండా చింతమనేని వ్యాఖ్యలు కూడా ప్రతిపక్ష పార్టీ దుష్ప్రచారమే అంటూ నిసిగ్గుగా ఎప్పటిలాగానే ఎదురు దాడికి దిగారు. బాధ్యత కలిగిన ప్రజా ప్రతినిధిగా ఉన్న చింతమనేని బహిరంగంగానే దళితులను కించపర్చేవిధంగా మాట్లాడినా ముఖ్యమంత్రి కనీసం నోరు మెదపడటం లేదు. గతంలో సాక్షాత్తూ ముఖ్యమంత్రే చంద్రబాబు ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. అధికారంలో ఉన్నామనే అహంకారంతో ఎమ్మెల్యే చింతమనేని ఆగడాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మరోవైపు చంద్రబాబు అండతోనే చింతమనేని మరింత రెచ్చిపోతున్నారని టీడీపీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top