‘చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం’ | C Ramachandraiah Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం’

Feb 13 2020 2:08 PM | Updated on Apr 7 2020 11:10 PM

C Ramachandraiah Slams Chandrababu Naidu - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా : చంద్రబాబు నాయుడు చైతన్య యాత్ర చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి సి రామచంద్రయ్య అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిజాయితీగా లేని కారణంగానే గత ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు తిరస్కరించారని విమర్శించారు. గత ఐదేళ్ల కాలంలో చంద్రబాబు వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తన అవినీతి సొమ్మంతా గడిచిన ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాలకు బదలాయించారన్నారు. ఐటీ దాడుల్లో ఆధారాలతో సహా దొరికిపోవడం వల్లే చంద్రబాబు వాటిపై మాట్లాడలేకపోతున్నారని ఆరోపించారు. గతంలో మోదీపై విరుచుకుపడిన చంద్రబాబు.. ఇప్పుడు బీజేపీతో జతకట్టేందుకు తహతహలాడుతున్నారని ఎద్దేవా చేశారు. దేశ ఆర్థిక రంగం కుదేలైనా, ఎన్నో సమస్యలు వచ్చినా బీజేపీపై విమర్శలు చేయకుండా మౌనంగా ఉంటున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రజా విద్రోహ కార్యక్రమాలు బట్టబయలై జైలుకు వెళ్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. బాబు అవినీతి ఆరోపణలపై కేంద్ర సంస్థలు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.



పచ్చ మీడియా విష ప్రచారం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనపై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందిన రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం గంటన్నరపాటు రాష్ట్ర సమస్యలపై సీఎం జగన్‌తో మోదీ చర్చిస్తే... ఎల్లో మీడియా మాత్రం వేరే విధంగా వార్తలు రాసిందని మండిపడ్డారు. కియాపై ప్రధాని మందలించాడని చెప్పడం దారుణమన్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ఎల్లో మీడియా, చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement