స్మృతి ఇరానీకి మద్దతు తెలిపిన అరుణ్‌ జైట్లీ

Arun Jaitley On Rahul Gandhi Education - Sakshi

న్యూఢిల్లీ : ఓ వారం రోజుల నుంచి దేశవ్యాప్తంగా స్మృతి ఇరానీ గురించిన చర్చే నడుస్తోంది. స్మృతి డిగ్రీ పూర్తి చేయలేదని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే గతంలో సమర్పించిన నివేదికలో మాత్రం ఆమె డిగ్రీ పూర్తి చేసినట్లు తప్పుడు సమాచారాన్ని పొందుపర్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ స్మృతి ఇరానీ నామినేషన్‌ను తిరస్కరించాలని డిమాండ్‌ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ.. స్మృతి ఇరానీకి మద్దతిస్తూ ఆమె తరఫున వకల్తా పుచ్చుకున్నారు. స్మృతి ఇరానీ డిగ్రీ చేయలేదు సరే.. మరి మీ నాయకుడు మాస్టర్స్‌ చేయకుండానే ఎం.ఫిల్‌ పూర్తి చేశాడు. దీనికి ఏం సమాధానం చెప్తారంటూ అరుణ్‌ జైట్లీ కాంగ్రెస్‌ నాయకులను ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే స్మృతి ఇరానీ తన ఎన్నికల అఫిడవిట్‌లో డిగ్రీ పూర్తి చేయలేదని పేర్కొనడంతో, ఇంతకాలం ఆమె విద్యార్హతలపై తలెత్తిన వివాదం కొలిక్కి వచ్చింది. ఇన్నాళ్ల నుంచి తన డిగ్రీ పూర్తి అయ్యిందని స్మృతి చేసిన వాదనలు తప్పుగా నిరూపణ అయ్యాయి. దాంతో కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది.. ఎన్నికల కమిషన్ స్మృతి ఇరానీ నామినేషన్‌ని తిరస్కరించాలంటూ డిమాండ్ చేశారు. స్మృతి ఇరానీ తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించిందని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top