బీసీజీ నివేదికపై స్పందించిన ఆదిమూలపు

Adimulapu Suresh Comments On Decentralised Development In AP - Sakshi

సాక్షి, అమరావతి : రాజధాని అంశంపై బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ), జీఎన్‌ రావు కమిటీ ఇచ్చిన నివేదికలపై క్షుణ్ణంగా చర్చిస్తామని విద్యాశాఖ మంత్రి, హైపవర్‌ కమిటీ సభ్యుడు ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ఈ నివేదికల్ని అధ్యయనం చేసేందుకు హైపవర్‌ కమిటీ త్వరలోనే సమావేశవుతుందని వెల్లడించారు. సచివాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకునేలా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అన్ని ప్రాంతాల్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి యోచిస్తున్నారని మంత్రి వెల్లడించారు.

(చదవండి : సీఎం జగన్‌కు నివేదిక సమర్పించిన బీసీజీ)

అమరావతిని లక్ష కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం సాధ్యం కాదని మంత్రి తేల్చిచెప్పారు. అమరావతిని అప్పులు చేసి నిర్మిస్తే ఎన్ని సంవత్సరాలకు పూర్తవుతుందో తెలియదని పేర్కొన్నారు. వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం జిల్లాకు తాగు, సాగునీరు ప్రాజెక్టులు అవసరమని సురేష్‌ తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అందుకే వాస్తవ ప్రణాళికల అమలు జరగాలని అన్నారు. బీసీజీ, జీఎన్‌ రావు కమిటీ నివేదికలను ప్రజలందరిలో చర్చకు పెడతామని అన్నారు. అసెంబ్లీలో కూడా సమగ్రంగా చర్చించి సీఎం జగన్‌ నిర్ణయం తీసుకుంటారని మంత్రి వెల్లడించారు. 
(చదవండి : వికేంద్రీకరణకే మొగ్గు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top