మోడీతో జోడీ, బీసీలకు బురిడీ | narendra modi Buridi to bc people | Sakshi
Sakshi News home page

మోడీతో జోడీ, బీసీలకు బురిడీ

May 6 2014 12:15 AM | Updated on Jul 6 2019 3:48 PM

మోడీతో జోడీ, బీసీలకు బురిడీ - Sakshi

మోడీతో జోడీ, బీసీలకు బురిడీ

పవన్ కల్యాణ్ వెనుక ఆర్‌ఎస్‌ఎస్ శక్తులున్నాయి. ఆయన కరుడుగట్టిన హిందూ రాజకీయవాదిగా తయారవుతున్నారు. ఇది ప్రమాదకరం. శత్రువును నిర్దేశించుకోలేకపోతే శత్రువే బలితీసుకుంటాడు. చంద్రబాబునాయుడిలో ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

పవన్  కల్యాణ్ వెనుక ఆర్‌ఎస్‌ఎస్ శక్తులున్నాయి. ఆయన కరుడుగట్టిన హిందూ రాజకీయవాదిగా తయారవుతున్నారు. ఇది ప్రమాదకరం. శత్రువును నిర్దేశించుకోలేకపోతే శత్రువే బలితీసుకుంటాడు. చంద్రబాబునాయుడిలో ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.
 
  హిందూ ఫాసిజం ఒక్కోసారి ఒక్కో అవతారాన్ని రాజ కీయ తెరపైకి తెస్తుంది. ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్, బీజేపీ, దేశంలోని హిందూ పెట్టుబడిదారులంతా కలిసి సృష్టించిన రాజకీయ రూపమే నరేంద్ర మోడీ!  ఎందరో ముస్లింలనూ, క్రైస్తవులనూ నిలబడి ఊచకోత కోయించిన చరిత్ర ఆయనది. అలాంటి వ్యక్తి ఈ రోజు ఈ దేశానికి ప్రధాని అవుతాడేమోనని ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, దళితులు ఎంతో భయపడుతున్నారు. ఆయన పాశవిక చరిత్ర అందరికీ తెలిసిందే. ఆయన రాజకీయ ఎదుగుదలలో లౌకిక దృక్పథమే లేదు. నిజానికి ఆయన వ్యక్తిత్వం అక్షరాలా భారత రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచేదిగా ఉంటుంది.

 నిలువెల్లా మత విద్వేషం

 గాంధీజీ హత్యానంతరం 1948లో ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం విధించడం ఆ సంస్థ నిజ స్వభావాన్ని తెలియజేస్తుంది. 1951లోనే జనసంఘ్ స్థాపనతో హిందూ మతరాజకీయాలకు బీజం పడింది. ఆనాటినుంచి ప్రారంభమైన హిందూ రాజకీయ మహాప్రస్థానం 1984లో విశ్వహిందూ పరిషత్ ‘‘ఏకాత్మక వాదాన్ని’’ భుజానికెత్తుకుంది. క్రమంగా ముస్లిం, క్రైస్తవులకు వ్యతిరేకంగా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. వర్ణవ్యవస్థ పునాదులపై హిందూ రాజ్యాన్ని పునఃనిర్మించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతూ ఆర్‌ఎస్‌ఎస్, విహెచ్‌పీ, బీజేపీ ఒక వ్యూహాత్మక ప్రయాణంలో తయారైన మతవిద్వేషపూరితమైన వ్యక్తే నరేంద్ర మోడీ! 2002లో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా గుజరాత్‌లో ముస్లింల నరమేధం భారత చరిత్రలో నెత్తుటిపేజీలను సృష్టించింది. అలాంటి మోడీతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పొత్తు పెట్టుకోవడమంటే హిందూ నియంతృత్వ శక్తులతో చేతులు కలపడమే.

మత కలహాలు జరిగిన వెంటనే మోడీ పదవి నుంచి తప్పుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేసిన సంగతి ఎవరూ మర్చిపోలేదు. కరుడుగట్టిన మతవాదిగా ముద్రపడిన మోడీని బీజేపీ తన ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం, వెంకయ్యనాయుడు కూడా పదేపదే అదే మాట చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. నిన్నటివరకూ అద్వానీకి జేజేలు పలికిన వెంకయ్యనాయుడు వెంటనే మార్కెట్ శక్తుల సలహాతో మోడీకి పల్లకీ మోయడమే కాకుండా టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు కుదిర్చారు. ఎప్పటికైనా తెలుగునేలను పాలించాలన్న తన కోరికను వెంకయ్య ఇప్పుడు కనీసం చంద్రబాబు వెనుక ఉండి తీర్చుకోవాలనుకుంటున్నారు. 1981లో రిజర్వేషన్ వ్యతిరేక పోరాటం జరిపినప్పటి నుంచి ఈ రోజు వరకు దళిత బహుజనులకు రిజర్వేషన్ ఎత్తివేయాలనీ, ముస్లిం లను పాకిస్థాన్ తరిమికొడతామనీ, క్రైస్తవులకు వారి మత ప్రచారం చేసుకునే హక్కు లేదని బీజేపీ ప్రచారం చేస్తుంటే, బీసీలను ముఖ్యమంత్రి చేస్తానంటున్నబాబు బీసీ హక్కులను కాలరాస్తున్న మోడీతో ఎలా చేతులు కలుపుతారు? మోడీ ఒక బీసీ నాయకుడు. ఆయన ద్వారానే బీసీల రిజర్వేషన్లు రద్దు చేయించాలనీ, ఎస్‌సీల రిజర్వేషన్లు ఆపివేయాలనీ, మైనారిటీల హక్కులు కాలరాయాలనీ బీజేపీ వ్యూహం పన్నుతోంది. అందుకే ఈ ఎజెండాను ఆయన ముందు పెట్టారు. అయితే బీసీ నాయకులెవరూ మోడీని సమర్థించడం లేదు. ములాయం, లాలూ, నితీశ్ వంటి బీసీ నేతలంతా మోడీ తలకెత్తుకున్న బ్రాహ్మణవాదాన్ని పసిగట్టారు. అందుకే వెంకయ్యనాయుడు ద్వారా దక్షిణాదిన సంపన్న వర్గమైన కమ్మల అండదండలతో తమ సామంత రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి వ్యూహం పన్నారు. ఇప్పుడు చంద్రబాబు పార్టీ బీజేపీకి అనుబంధ సంస్థ మాత్రమే.

 రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత చంద్రబాబు కులానికి చెందిన వారు వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఆస్తులు కాపాడుకోవాలంటే బీజేపీ అండ కావాలి. ‘అభివృద్ధి కావాలంటే చంద్రబాబును ఎన్నుకోండి’ అనే నినాదాన్ని ఆ కులానికి చెందిన పెద్దలు ప్రచారంలో పెట్టారు. మరోవైపు పవన్ కల్యాణ్ వెనుక ఆర్‌ఎస్‌ఎస్ శక్తులున్నాయి. ఆయన కరుడుగట్టిన హిందూ రాజకీయవాదిగా తయారవుతున్నారు. ఇది ప్రమాదకరం. ఆయన సినిమాలనూ, వ్యక్తిత్వాన్నీ ఎవరైతే అభాసుపాలు చేశారో వారినే ఇప్పుడు పొగుడుతున్నారు. శత్రువును నిర్దేశించుకోలేకపోతే శత్రువే బలితీసుకుంటాడు. చంద్రబాబులో ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.కాపుల ఓట్ల కోసం ఆయన పవన్ కల్యాణ్‌ను ప్రచారానికి వాడుకుంటున్నారు.

 కమ్మ,రెడ్డి కులస్తులు రెండు రాష్ట్రాల్లోనూ ఆధిపత్యాన్ని చేజిక్కించుకునేందుకు వివిధ జాతీయ పార్టీలను ఆశ్రయిస్తున్నారు. స్వతంత్రంగా నిలబడుతున్న పార్టీలు కూడా తమ కులాలకే అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలు కూడా బీసీలకు ఇవ్వాల్సిన స్థాయిలో సీట్లు ఇవ్వలేదు.  పైపూత సంస్కరణలకే ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ దశలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ చెప్పినట్టు దళిత, బహుజన, మైనారిటీల, సెక్యులరిస్టుల సమన్వయంతో వినూత్న రాజకీయ శక్తుల ఆవిర్భావం కావాల్సిన చారిత్రక సందర్భం ముందుకొచ్చింది. రాజకీయ నాయకులనే కాకుండా వారి వెనుక ఉన్న కులాన్ని, ఆ పార్టీల వెనుక ఉన్న పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద, మతశక్తులను అర్థం చేసుకోవాల్సిన చారిత్రక సందర్భం ఇది.
 
డాక్టర్ కత్తిపద్మారావు
   (వ్యాసకర్త దళిత ఉద్యమ నాయకుడు)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement