kathi padhamarao
-
ఉన్నత స్థానాల్లో ఉన్నా ...
భారతదేశంలో మహార్లు వీరోచితమైన చరిత్ర కలిగినవారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఇటు వంటి మహార్లలో జన్మించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు. ఆయన తండ్రి రాంజీ సక్పాల్ భక్తి ఉద్యమానికి సంబంధించిన వారు. అంబేడ్కర్ బౌద్ధమతం స్వీకరించేవరకూ మహార్లు భక్తి ఉద్యమంలో ప్రముఖపాత్ర పోషించిన కబీర్ అనుయాయులుగా ఉన్నారు. ఆ తర్వాత బౌద్ధంలోకి మారారు. 1956 డిసెంబర్ 6న అంబేడ్కర్ ఇచ్చిన బౌద్ధ ధర్మ దీక్ష పొందినవారిలో ఒకరు రామకష్ణ సూర్య భాను గవాయి కుమార్. ప్రస్తుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి (బీఆర్ గవాయి) ఆయన కుమారుడే. తండ్రి వారస త్వాన్ని అందిపుచ్చుకుని బౌద్ధ మతస్థులతో కొనసాగు తున్న జస్టిస్ గవాయి బౌద్ధ జీవన వికాసానికీ, ఆత్మ గౌరవ స్వరానికీ, అవమానాన్ని ఎదిరించగలిగిన తత్వానికీ నిదర్శనంగా నిలిచారు.దళితులు ఎంతటి ఉన్నత స్థానానికి ఎదిగినప్ప టికీ ఏదో ఒక రూపంలో భారతీయ నిచ్చెన మెట్ల కుల సమాజంలో అవమానాలు ఎదుర్కొనవలసి రావడం విషాదకరం. దళితుడైన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కేరళ నుండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని అధిష్ఠించారు. ఆయన తాను అనేక అవమానాలను ఎదుర్కొన్నట్లు పదవీ విరమణ తరువాత చెప్పారు. రాష్ట్రపతి పదవిని చేపట్టిన కె.ఆర్. నారాయణ్ ఫ్రాన్స్లో గెస్ట్హౌస్లో ఉన్నప్పుడు ఒక విలేకరి ‘ఇండియన్ అన్ టచ్బుల్’ అన్న విషయాన్ని స్వయంగా పేర్కొన్న విషయం గమనార్హం. ఇప్పుడు దళితుడైన జస్టిస్ బీఆర్ గవాయి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) అయిన తర్వాత ఆయనకు తొలినాళ్లలోనే దక్కవలసిన ప్రొటోకాల్ మర్యాద దక్కకపోవడం చర్చనీయాంశం అయ్యింది.జస్టిస్ గవాయి సీజేఐ అయిన సందర్భంగా మహారాష్ట్ర–గోవా బార్ కౌన్సిల్ ఆయనకు ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్య క్రమానికి మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ముంబై పోలీస్ కమిషనర్ వంటి ఉన్నతాధికారులు హాజరు కాలేదు. మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి సీజేఐ వంటి ఉన్నత పదవికి ఎంపికైన తరువాత రాష్ట్రానికి తొలిసారి వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం వారు ఈ కార్యక్రమానికి హాజరు కావాలి. కానీ వారు హాజరు కాలేదు. ఈ సందర్భంగా జస్టిస్ గవాయి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘నేను నాకు లభించాల్సిన గౌరవం గురించి మాట్లాడడం లేదు. ఒక రాజ్యాంగ వ్యవస్థకు మరో రాజ్యాంగ వ్యవస్థ ఇవ్వాల్సిన గౌరవం గురించి మాట్లాడుతున్నాను’ అని అన్నారు.జస్టిస్ గవాయి గొప్ప సందేశకుడు, ధైర్యశాలి, నిక్కచ్చిగా మాట్లాడటం ఆయన నైజం. ఆయన ప్రమాణ స్వీకారం తరువాత చేసిన ప్రసంగం ఆలో చనను రేకెత్తించింది. దేశంలో ఏ వ్యవస్థా గొప్పది కాదనీ, భారత రాజ్యాంగం మాత్రమే సర్వోన్నతమైనదనీ ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో కీలక స్తంభాలు అయిన శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు మూడూ సమానమేననీ, అవి ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలనీ, పరస్పరం గౌరవించుకోవాలనీ స్పష్టం చేశారు. మహారాష్ట్ర–గోవా బార్ కౌన్సిల్ సత్కార సభలో ఆయన ఇచ్చిన 50 కీలక తీర్పుల సంకలన గ్రంథ ఆవిష్కారం జరిగింది. ఆ సందర్భంగా బుల్డోజర్ న్యాయానికి వ్యతిరేకంగా తానిచ్చిన తీర్పు గురించి వివరించారు. ‘నివాస హక్కు ప్రాథమిక హక్కు. ఏ వ్యక్తి అయినా ఏదైనా కేసులో నిందితుడైనా, దోషిగా నిర్ధారణ అయినా... అతడి కుటుంబ నివాసం చట్టబద్ధమైనదైతే దానిని తొలగించడానికి, కూల్చడానికి వీల్లేదు. చట్టాన్ని అనుసరించి వ్యవహరించాల్సిందే’ అని స్పష్టం చేశారు. బుద్ధిస్టు అయిన దళితుడు దేశ అత్యున్నత న్యాయమూర్తి కావడం మంచి పరిణామం.అంబేడ్కర్ భారత రాజ్యాంగకర్తగా ఉండి అనేక అవమానాలు పొందారు. అయితే ఆయన సానుకూల దృక్పథంతో ప్రత్యామ్నాయాలు సృష్టిస్తూ వెళ్ళారు. ఇపుడు భారత రాజ్యాంగ అనుసరణ అనేది ఒక ప్రధాన భూమికగా మారింది. దశాబ్దంలో హిందూ మతోన్మాదశక్తులు, కార్పొరేట్ ఆధిపత్య శక్తులు జమిలిగా మనుస్మృతి భావాజాల ఆధిక్యతను ప్రకటించాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో జస్టిస్ గవాయి ఇచ్చిన ఆత్మ గౌరవ ఫీలింగ్ ప్రాధాన్యం సంతరించుకుంది. ‘కులం పునాదుల మీద ఒక జాతిని నిర్మించలేరు, ఒక నీతిని నిర్మించలేరు’ అని అంబేడ్కర్ చెప్పారు. ఈ సూత్రాన్ని గ్రహించి దేశంలో రాజ్యాంగం పేర్కొంటున్న సమానత్వం నెలకొనడానికి కృషి జరగాలి. రాజ్యాంగాన్ని అమలు చేసే స్థానంలో ఉన్న వారే కుల వ్యవస్థ దారుణాన్ని చవిచూసినవారైతే వారు ఇచ్చే తీర్పులు ఎలా ఉంటాయో చెప్పనవసరం లేదు.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడుమొబైల్: 98497 41695 -
ఆ మృతవీరులు ప్రపంచానికి వేగు చుక్కలు
చుండూరు పోరాటం వెనుక ఉన్న చరిత్రను సరిగా అవగాహన చేసుకోకపోతే ఇది కేవలం కేసుల కోసం పోరాడినట్లే కనబడుతుంది. అయితే ఈ న్యాయపోరాటం దళిత విముక్తి పోరాటంలో భాగం మాత్రమే. చుండూరు మృతవీరులు దళితుల స్వా తంత్య్రోద్యమంలో హతులైన వీరులు. విద్యకోసం, న్యాయంకోసం, సమత్వం కోసం, ఆత్మగౌరవం కోసం అగ్రకులా లతో పోరాడి అమరులైన చారిత్రక పురు షులు. చుండూరు మారణ హోమం జరిగి 2014 ఆగస్టు 6 నాటికి 23 ఏళ్లు పూర్తవు తున్న సందర్భంలో చుండూరు న్యాయ పోరాట పునశ్చరణ ఒక చారిత్రక సంద ర్భం. 1991 ఆగస్టు 6 ఉదయం అగ్రకులాలవారు బరిసెలు, గండ్ర గొడ్డళ్లు, కత్తులతో చుండూరు దళితవాడ మీద దాడి చేసి ఎనిమిది మందిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన భారతదేశంలో కులానికి ఉండే పదునును బయట పెట్టింది. కులం ఎంత ప్రమాదకరమైందో, వర్గం కంటే కులం ఎంత వాస్తవికమైన అణచివేతకు ప్రతీకగా ఉందో ఈ ఘటనవల్ల అర్థమైంది. చిన్న చిన్న ఘటనలను ఆధారం చేసుకుని అగ్రకులాలు వ్యూహం పన్ని దారుణ హత్యలకు పాల్పడి గోనెసంచుల్లో కట్టి తుంగభద్ర కాలువల్లో తొక్కి పెట్టారు. ఆంధ్రప్రదేశ్ దళి త మహాసభ తుంగభద్రలో ఉన్న శవాలను ఏరి ప్రపంచానికి చూపించి పోరాటానికి నడుంకట్టి ఢిల్లీ వరకు ఈ పోరాటాన్ని తీసుకెళ్లింది. నాటి రాష్ట్ర సీఎం ఎన్.జనార్దనరెడ్డి చివరి వరకు నిందితుల పక్షానే నిలిచారు. అయినా, ఈ ఘటనను ఢిల్లీ పార్లమెంటుకు తీసుకెళ్లి అనేక డిమాండ్లను జాతీయ స్థాయిలో సాధించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా మూడు డిమాండ్లు ముందుకు వచ్చాయి. 1. 1989 ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ ఎట్రాసిటీ యాక్ట్ ప్రకారం ఊరిలోనే ప్రత్యేక కోర్టు పెట్టాలి. 2. రక్తపాతం జరిగిన దగ్గర ఊరు మొత్తాన్ని యూనిట్గా తీసుకుని అందరికీ పునరావా సం కల్పించాలి. 3. రెసిడెన్షియల్ కాలేజీని ఊరిలో కట్టాలి. ఈ మూడు డిమాండ్లను నాటి రాష్ట్ర ప్రభుత్వం ఆంగీక రించనందున, 107 మంది ఎంపీలను ఏకంచేసి ఢిల్లీలోని బోట్ క్లబ్ వద్ద నెలరోజుల పాటు పోరాటం చేశాము. అంబే ద్కర్ భవన్ నుండి రోజూ బోట్ క్లబ్ వరకు 25 రోజులు జరిగిన ర్యాలీలు భారతదేశాన్ని కుదిపివేశాయి. పార్లమెం టును తీవ్రంగా ఒత్తిడి పెట్టి చుండూరులో ప్రత్యేక కోర్టు ఏర్పాటును సాధించుకున్నాము. నాటి ప్రధాని పీవీ నరసిం హారావు ముందు పెట్టిన రెండో డిమాండ్ ఫలించి చుండూ రులో రెసిడెన్షియల్ కాలేజీ నిర్మాణం జరిగింది. చుట్టుపక్కల 50 గ్రామాల దళిత విద్యార్థులు ఈ కాలేజీలో చదువుకు న్నారు. ఈ కాలేజీలో 50 శాతం సీట్లు చుండూరు బాధితు లకు లభ్యమవ్వడంతో మొత్తం రాష్ట్రంలోనే అత్యున్నత విద్య కల్గిన దళితవాడగా చుండూరు బాధితుల కాలనీ రూపొం దింది. చుండూరు దళితవాడలో ప్రతి ఇంటికీ అర ఎకరం చొప్పున 224 ఎకరాల భూమి దక్కింది. మృతుల కుటుం బాలతో సహా 40 మందికి ఉద్యోగాలు సాధించాము. చుండూరు ఉద్యమం గురించి అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరిగిన తర్వాత 2004లో ప్రత్యేక కోర్టు ప్రారంభ మైంది. చుండూరు సాక్ష్యులు ఇచ్చిన సాక్ష్యాలతో జడ్జీలే కంట తడిపెట్టారు. ప్రత్యేక కోర్టులో ముద్దాయిలు 219 మంది, సాక్షులు 134 మంది, ఐదుగురు జడ్జీలు ఈ కేసును విచారించారు. 2007 ఆగస్టు 31న 21 మంది నింది తులకు జీవితఖైదు, 35 మందికి సంవత్సర శిక్ష, 2 వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ కేసు హైకోర్టుకు వెళ్లింది. 2014 జనవరిలో కేసు అప్పీలుకు రాగా, చుండూరు ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును ఏప్రిల్ 22న హైకోర్టు కొట్టి వేసింది. హైకోర్టు తీర్పులో వివక్ష ఉందని దేశవ్యాప్తంగా ఉద్యమించారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు జూలై 30న హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది. భారతదేశంలో న్యాయస్థానాలకు కూడా కులం ఉంటుం దని చుండూరు కేసు రుజువు చేసింది. ఏదో ఒక సంఘటన లోను, ఒక కేసును బట్టో దళితులకు న్యాయం జరుగుతుం దని భావించరాదు. ఇది నిరంతర పోరాటం, చుండూరు పోరాటం వెనుక ఉన్న చరిత్రను సరిగా అవగాహన చేసుకోక పోతే ఇది కేవలం కేసుల కోసం పోరాడినట్లే కనబడుతుంది. అయితే ఈ న్యాయపోరాటం దళిత విముక్తి పోరాటంలో భాగమే. అంతిమంగా కులం నిర్మూలన అయ్యే వరకు, భూమి పంపిణీ అయ్యే వరకు ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఈ పోరాటంలో అందరూ భాగస్వాములే.. అం దుకే చుండూరు మృత వీరులు ప్రపంచానికి వేగుచుక్కలు. (ఆగస్టు 6న చుండూరు బాధితుల 23వ వర్ధంతి సందర్భంగా) కత్తి పద్మారావు -
మోడీతో జోడీ, బీసీలకు బురిడీ
పవన్ కల్యాణ్ వెనుక ఆర్ఎస్ఎస్ శక్తులున్నాయి. ఆయన కరుడుగట్టిన హిందూ రాజకీయవాదిగా తయారవుతున్నారు. ఇది ప్రమాదకరం. శత్రువును నిర్దేశించుకోలేకపోతే శత్రువే బలితీసుకుంటాడు. చంద్రబాబునాయుడిలో ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. హిందూ ఫాసిజం ఒక్కోసారి ఒక్కో అవతారాన్ని రాజ కీయ తెరపైకి తెస్తుంది. ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, బీజేపీ, దేశంలోని హిందూ పెట్టుబడిదారులంతా కలిసి సృష్టించిన రాజకీయ రూపమే నరేంద్ర మోడీ! ఎందరో ముస్లింలనూ, క్రైస్తవులనూ నిలబడి ఊచకోత కోయించిన చరిత్ర ఆయనది. అలాంటి వ్యక్తి ఈ రోజు ఈ దేశానికి ప్రధాని అవుతాడేమోనని ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, దళితులు ఎంతో భయపడుతున్నారు. ఆయన పాశవిక చరిత్ర అందరికీ తెలిసిందే. ఆయన రాజకీయ ఎదుగుదలలో లౌకిక దృక్పథమే లేదు. నిజానికి ఆయన వ్యక్తిత్వం అక్షరాలా భారత రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచేదిగా ఉంటుంది. నిలువెల్లా మత విద్వేషం గాంధీజీ హత్యానంతరం 1948లో ఆర్ఎస్ఎస్పై నిషేధం విధించడం ఆ సంస్థ నిజ స్వభావాన్ని తెలియజేస్తుంది. 1951లోనే జనసంఘ్ స్థాపనతో హిందూ మతరాజకీయాలకు బీజం పడింది. ఆనాటినుంచి ప్రారంభమైన హిందూ రాజకీయ మహాప్రస్థానం 1984లో విశ్వహిందూ పరిషత్ ‘‘ఏకాత్మక వాదాన్ని’’ భుజానికెత్తుకుంది. క్రమంగా ముస్లిం, క్రైస్తవులకు వ్యతిరేకంగా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. వర్ణవ్యవస్థ పునాదులపై హిందూ రాజ్యాన్ని పునఃనిర్మించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతూ ఆర్ఎస్ఎస్, విహెచ్పీ, బీజేపీ ఒక వ్యూహాత్మక ప్రయాణంలో తయారైన మతవిద్వేషపూరితమైన వ్యక్తే నరేంద్ర మోడీ! 2002లో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా గుజరాత్లో ముస్లింల నరమేధం భారత చరిత్రలో నెత్తుటిపేజీలను సృష్టించింది. అలాంటి మోడీతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పొత్తు పెట్టుకోవడమంటే హిందూ నియంతృత్వ శక్తులతో చేతులు కలపడమే. మత కలహాలు జరిగిన వెంటనే మోడీ పదవి నుంచి తప్పుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేసిన సంగతి ఎవరూ మర్చిపోలేదు. కరుడుగట్టిన మతవాదిగా ముద్రపడిన మోడీని బీజేపీ తన ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం, వెంకయ్యనాయుడు కూడా పదేపదే అదే మాట చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. నిన్నటివరకూ అద్వానీకి జేజేలు పలికిన వెంకయ్యనాయుడు వెంటనే మార్కెట్ శక్తుల సలహాతో మోడీకి పల్లకీ మోయడమే కాకుండా టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు కుదిర్చారు. ఎప్పటికైనా తెలుగునేలను పాలించాలన్న తన కోరికను వెంకయ్య ఇప్పుడు కనీసం చంద్రబాబు వెనుక ఉండి తీర్చుకోవాలనుకుంటున్నారు. 1981లో రిజర్వేషన్ వ్యతిరేక పోరాటం జరిపినప్పటి నుంచి ఈ రోజు వరకు దళిత బహుజనులకు రిజర్వేషన్ ఎత్తివేయాలనీ, ముస్లిం లను పాకిస్థాన్ తరిమికొడతామనీ, క్రైస్తవులకు వారి మత ప్రచారం చేసుకునే హక్కు లేదని బీజేపీ ప్రచారం చేస్తుంటే, బీసీలను ముఖ్యమంత్రి చేస్తానంటున్నబాబు బీసీ హక్కులను కాలరాస్తున్న మోడీతో ఎలా చేతులు కలుపుతారు? మోడీ ఒక బీసీ నాయకుడు. ఆయన ద్వారానే బీసీల రిజర్వేషన్లు రద్దు చేయించాలనీ, ఎస్సీల రిజర్వేషన్లు ఆపివేయాలనీ, మైనారిటీల హక్కులు కాలరాయాలనీ బీజేపీ వ్యూహం పన్నుతోంది. అందుకే ఈ ఎజెండాను ఆయన ముందు పెట్టారు. అయితే బీసీ నాయకులెవరూ మోడీని సమర్థించడం లేదు. ములాయం, లాలూ, నితీశ్ వంటి బీసీ నేతలంతా మోడీ తలకెత్తుకున్న బ్రాహ్మణవాదాన్ని పసిగట్టారు. అందుకే వెంకయ్యనాయుడు ద్వారా దక్షిణాదిన సంపన్న వర్గమైన కమ్మల అండదండలతో తమ సామంత రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి వ్యూహం పన్నారు. ఇప్పుడు చంద్రబాబు పార్టీ బీజేపీకి అనుబంధ సంస్థ మాత్రమే. రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత చంద్రబాబు కులానికి చెందిన వారు వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్లోని ఆస్తులు కాపాడుకోవాలంటే బీజేపీ అండ కావాలి. ‘అభివృద్ధి కావాలంటే చంద్రబాబును ఎన్నుకోండి’ అనే నినాదాన్ని ఆ కులానికి చెందిన పెద్దలు ప్రచారంలో పెట్టారు. మరోవైపు పవన్ కల్యాణ్ వెనుక ఆర్ఎస్ఎస్ శక్తులున్నాయి. ఆయన కరుడుగట్టిన హిందూ రాజకీయవాదిగా తయారవుతున్నారు. ఇది ప్రమాదకరం. ఆయన సినిమాలనూ, వ్యక్తిత్వాన్నీ ఎవరైతే అభాసుపాలు చేశారో వారినే ఇప్పుడు పొగుడుతున్నారు. శత్రువును నిర్దేశించుకోలేకపోతే శత్రువే బలితీసుకుంటాడు. చంద్రబాబులో ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.కాపుల ఓట్ల కోసం ఆయన పవన్ కల్యాణ్ను ప్రచారానికి వాడుకుంటున్నారు. కమ్మ,రెడ్డి కులస్తులు రెండు రాష్ట్రాల్లోనూ ఆధిపత్యాన్ని చేజిక్కించుకునేందుకు వివిధ జాతీయ పార్టీలను ఆశ్రయిస్తున్నారు. స్వతంత్రంగా నిలబడుతున్న పార్టీలు కూడా తమ కులాలకే అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలు కూడా బీసీలకు ఇవ్వాల్సిన స్థాయిలో సీట్లు ఇవ్వలేదు. పైపూత సంస్కరణలకే ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ దశలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ చెప్పినట్టు దళిత, బహుజన, మైనారిటీల, సెక్యులరిస్టుల సమన్వయంతో వినూత్న రాజకీయ శక్తుల ఆవిర్భావం కావాల్సిన చారిత్రక సందర్భం ముందుకొచ్చింది. రాజకీయ నాయకులనే కాకుండా వారి వెనుక ఉన్న కులాన్ని, ఆ పార్టీల వెనుక ఉన్న పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద, మతశక్తులను అర్థం చేసుకోవాల్సిన చారిత్రక సందర్భం ఇది. డాక్టర్ కత్తిపద్మారావు (వ్యాసకర్త దళిత ఉద్యమ నాయకుడు)