
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయి
అభిప్రాయం
భారతదేశంలో మహార్లు వీరోచితమైన చరిత్ర కలిగినవారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఇటు వంటి మహార్లలో జన్మించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు. ఆయన తండ్రి రాంజీ సక్పాల్ భక్తి ఉద్యమానికి సంబంధించిన వారు. అంబేడ్కర్ బౌద్ధమతం స్వీకరించేవరకూ మహార్లు భక్తి ఉద్యమంలో ప్రముఖపాత్ర పోషించిన కబీర్ అనుయాయులుగా ఉన్నారు. ఆ తర్వాత బౌద్ధంలోకి మారారు.
1956 డిసెంబర్ 6న అంబేడ్కర్ ఇచ్చిన బౌద్ధ ధర్మ దీక్ష పొందినవారిలో ఒకరు రామకష్ణ సూర్య భాను గవాయి కుమార్. ప్రస్తుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి (బీఆర్ గవాయి) ఆయన కుమారుడే. తండ్రి వారస త్వాన్ని అందిపుచ్చుకుని బౌద్ధ మతస్థులతో కొనసాగు తున్న జస్టిస్ గవాయి బౌద్ధ జీవన వికాసానికీ, ఆత్మ గౌరవ స్వరానికీ, అవమానాన్ని ఎదిరించగలిగిన తత్వానికీ నిదర్శనంగా నిలిచారు.
దళితులు ఎంతటి ఉన్నత స్థానానికి ఎదిగినప్ప టికీ ఏదో ఒక రూపంలో భారతీయ నిచ్చెన మెట్ల కుల సమాజంలో అవమానాలు ఎదుర్కొనవలసి రావడం విషాదకరం. దళితుడైన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కేరళ నుండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని అధిష్ఠించారు. ఆయన తాను అనేక అవమానాలను ఎదుర్కొన్నట్లు పదవీ విరమణ తరువాత చెప్పారు.
రాష్ట్రపతి పదవిని చేపట్టిన కె.ఆర్. నారాయణ్ ఫ్రాన్స్లో గెస్ట్హౌస్లో ఉన్నప్పుడు ఒక విలేకరి ‘ఇండియన్ అన్ టచ్బుల్’ అన్న విషయాన్ని స్వయంగా పేర్కొన్న విషయం గమనార్హం. ఇప్పుడు దళితుడైన జస్టిస్ బీఆర్ గవాయి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) అయిన తర్వాత ఆయనకు తొలినాళ్లలోనే దక్కవలసిన ప్రొటోకాల్ మర్యాద దక్కకపోవడం చర్చనీయాంశం అయ్యింది.
జస్టిస్ గవాయి సీజేఐ అయిన సందర్భంగా మహారాష్ట్ర–గోవా బార్ కౌన్సిల్ ఆయనకు ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్య క్రమానికి మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ముంబై పోలీస్ కమిషనర్ వంటి ఉన్నతాధికారులు హాజరు కాలేదు.
మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి సీజేఐ వంటి ఉన్నత పదవికి ఎంపికైన తరువాత రాష్ట్రానికి తొలిసారి వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం వారు ఈ కార్యక్రమానికి హాజరు కావాలి. కానీ వారు హాజరు కాలేదు. ఈ సందర్భంగా జస్టిస్ గవాయి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘నేను నాకు లభించాల్సిన గౌరవం గురించి మాట్లాడడం లేదు. ఒక రాజ్యాంగ వ్యవస్థకు మరో రాజ్యాంగ వ్యవస్థ ఇవ్వాల్సిన గౌరవం గురించి మాట్లాడుతున్నాను’ అని అన్నారు.
జస్టిస్ గవాయి గొప్ప సందేశకుడు, ధైర్యశాలి, నిక్కచ్చిగా మాట్లాడటం ఆయన నైజం. ఆయన ప్రమాణ స్వీకారం తరువాత చేసిన ప్రసంగం ఆలో చనను రేకెత్తించింది. దేశంలో ఏ వ్యవస్థా గొప్పది కాదనీ, భారత రాజ్యాంగం మాత్రమే సర్వోన్నతమైనదనీ ఆయన అన్నారు.
ప్రజాస్వామ్యంలో కీలక స్తంభాలు అయిన శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు మూడూ సమానమేననీ, అవి ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలనీ, పరస్పరం గౌరవించుకోవాలనీ స్పష్టం చేశారు. మహారాష్ట్ర–గోవా బార్ కౌన్సిల్ సత్కార సభలో ఆయన ఇచ్చిన 50 కీలక తీర్పుల సంకలన గ్రంథ ఆవిష్కారం జరిగింది.
ఆ సందర్భంగా బుల్డోజర్ న్యాయానికి వ్యతిరేకంగా తానిచ్చిన తీర్పు గురించి వివరించారు. ‘నివాస హక్కు ప్రాథమిక హక్కు. ఏ వ్యక్తి అయినా ఏదైనా కేసులో నిందితుడైనా, దోషిగా నిర్ధారణ అయినా... అతడి కుటుంబ నివాసం చట్టబద్ధమైనదైతే దానిని తొలగించడానికి, కూల్చడానికి వీల్లేదు. చట్టాన్ని అనుసరించి వ్యవహరించాల్సిందే’ అని స్పష్టం చేశారు. బుద్ధిస్టు అయిన దళితుడు దేశ అత్యున్నత న్యాయమూర్తి కావడం మంచి పరిణామం.
అంబేడ్కర్ భారత రాజ్యాంగకర్తగా ఉండి అనేక అవమానాలు పొందారు. అయితే ఆయన సానుకూల దృక్పథంతో ప్రత్యామ్నాయాలు సృష్టిస్తూ వెళ్ళారు. ఇపుడు భారత రాజ్యాంగ అనుసరణ అనేది ఒక ప్రధాన భూమికగా మారింది. దశాబ్దంలో హిందూ మతోన్మాదశక్తులు, కార్పొరేట్ ఆధిపత్య శక్తులు జమిలిగా మనుస్మృతి భావాజాల ఆధిక్యతను ప్రకటించాలని చూస్తున్నాయి.
ఈ నేపథ్యంలో జస్టిస్ గవాయి ఇచ్చిన ఆత్మ గౌరవ ఫీలింగ్ ప్రాధాన్యం సంతరించుకుంది. ‘కులం పునాదుల మీద ఒక జాతిని నిర్మించలేరు, ఒక నీతిని నిర్మించలేరు’ అని అంబేడ్కర్ చెప్పారు. ఈ సూత్రాన్ని గ్రహించి దేశంలో రాజ్యాంగం పేర్కొంటున్న సమానత్వం నెలకొనడానికి కృషి జరగాలి. రాజ్యాంగాన్ని అమలు చేసే స్థానంలో ఉన్న వారే కుల వ్యవస్థ దారుణాన్ని చవిచూసినవారైతే వారు ఇచ్చే తీర్పులు ఎలా ఉంటాయో చెప్పనవసరం లేదు.
డా‘‘ కత్తి పద్మారావు
వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు
మొబైల్: 98497 41695