
ఆ మృతవీరులు ప్రపంచానికి వేగు చుక్కలు
చుండూరు పోరాటం వెనుక ఉన్న చరిత్రను సరిగా అవగాహన చేసుకోకపోతే ఇది కేవలం కేసుల కోసం పోరాడినట్లే కనబడుతుంది. అయితే ఈ న్యాయపోరాటం దళిత విముక్తి పోరాటంలో భాగం మాత్రమే.
చుండూరు పోరాటం వెనుక ఉన్న చరిత్రను సరిగా అవగాహన చేసుకోకపోతే ఇది కేవలం కేసుల కోసం పోరాడినట్లే కనబడుతుంది. అయితే ఈ న్యాయపోరాటం దళిత విముక్తి పోరాటంలో భాగం మాత్రమే.
చుండూరు మృతవీరులు దళితుల స్వా తంత్య్రోద్యమంలో హతులైన వీరులు. విద్యకోసం, న్యాయంకోసం, సమత్వం కోసం, ఆత్మగౌరవం కోసం అగ్రకులా లతో పోరాడి అమరులైన చారిత్రక పురు షులు. చుండూరు మారణ హోమం జరిగి 2014 ఆగస్టు 6 నాటికి 23 ఏళ్లు పూర్తవు తున్న సందర్భంలో చుండూరు న్యాయ పోరాట పునశ్చరణ ఒక చారిత్రక సంద ర్భం. 1991 ఆగస్టు 6 ఉదయం అగ్రకులాలవారు బరిసెలు, గండ్ర గొడ్డళ్లు, కత్తులతో చుండూరు దళితవాడ మీద దాడి చేసి ఎనిమిది మందిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన భారతదేశంలో కులానికి ఉండే పదునును బయట పెట్టింది. కులం ఎంత ప్రమాదకరమైందో, వర్గం కంటే కులం ఎంత వాస్తవికమైన అణచివేతకు ప్రతీకగా ఉందో ఈ ఘటనవల్ల అర్థమైంది.
చిన్న చిన్న ఘటనలను ఆధారం చేసుకుని అగ్రకులాలు వ్యూహం పన్ని దారుణ హత్యలకు పాల్పడి గోనెసంచుల్లో కట్టి తుంగభద్ర కాలువల్లో తొక్కి పెట్టారు. ఆంధ్రప్రదేశ్ దళి త మహాసభ తుంగభద్రలో ఉన్న శవాలను ఏరి ప్రపంచానికి చూపించి పోరాటానికి నడుంకట్టి ఢిల్లీ వరకు ఈ పోరాటాన్ని తీసుకెళ్లింది. నాటి రాష్ట్ర సీఎం ఎన్.జనార్దనరెడ్డి చివరి వరకు నిందితుల పక్షానే నిలిచారు. అయినా, ఈ ఘటనను ఢిల్లీ పార్లమెంటుకు తీసుకెళ్లి అనేక డిమాండ్లను జాతీయ స్థాయిలో సాధించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా మూడు డిమాండ్లు ముందుకు వచ్చాయి. 1. 1989 ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ ఎట్రాసిటీ యాక్ట్ ప్రకారం ఊరిలోనే ప్రత్యేక కోర్టు పెట్టాలి. 2. రక్తపాతం జరిగిన దగ్గర ఊరు మొత్తాన్ని యూనిట్గా తీసుకుని అందరికీ పునరావా సం కల్పించాలి. 3. రెసిడెన్షియల్ కాలేజీని ఊరిలో కట్టాలి.
ఈ మూడు డిమాండ్లను నాటి రాష్ట్ర ప్రభుత్వం ఆంగీక రించనందున, 107 మంది ఎంపీలను ఏకంచేసి ఢిల్లీలోని బోట్ క్లబ్ వద్ద నెలరోజుల పాటు పోరాటం చేశాము. అంబే ద్కర్ భవన్ నుండి రోజూ బోట్ క్లబ్ వరకు 25 రోజులు జరిగిన ర్యాలీలు భారతదేశాన్ని కుదిపివేశాయి. పార్లమెం టును తీవ్రంగా ఒత్తిడి పెట్టి చుండూరులో ప్రత్యేక కోర్టు ఏర్పాటును సాధించుకున్నాము. నాటి ప్రధాని పీవీ నరసిం హారావు ముందు పెట్టిన రెండో డిమాండ్ ఫలించి చుండూ రులో రెసిడెన్షియల్ కాలేజీ నిర్మాణం జరిగింది. చుట్టుపక్కల 50 గ్రామాల దళిత విద్యార్థులు ఈ కాలేజీలో చదువుకు న్నారు. ఈ కాలేజీలో 50 శాతం సీట్లు చుండూరు బాధితు లకు లభ్యమవ్వడంతో మొత్తం రాష్ట్రంలోనే అత్యున్నత విద్య కల్గిన దళితవాడగా చుండూరు బాధితుల కాలనీ రూపొం దింది. చుండూరు దళితవాడలో ప్రతి ఇంటికీ అర ఎకరం చొప్పున 224 ఎకరాల భూమి దక్కింది. మృతుల కుటుం బాలతో సహా 40 మందికి ఉద్యోగాలు సాధించాము.
చుండూరు ఉద్యమం గురించి అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరిగిన తర్వాత 2004లో ప్రత్యేక కోర్టు ప్రారంభ మైంది. చుండూరు సాక్ష్యులు ఇచ్చిన సాక్ష్యాలతో జడ్జీలే కంట తడిపెట్టారు. ప్రత్యేక కోర్టులో ముద్దాయిలు 219 మంది, సాక్షులు 134 మంది, ఐదుగురు జడ్జీలు ఈ కేసును విచారించారు. 2007 ఆగస్టు 31న 21 మంది నింది తులకు జీవితఖైదు, 35 మందికి సంవత్సర శిక్ష, 2 వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ కేసు హైకోర్టుకు వెళ్లింది. 2014 జనవరిలో కేసు అప్పీలుకు రాగా, చుండూరు ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును ఏప్రిల్ 22న హైకోర్టు కొట్టి వేసింది. హైకోర్టు తీర్పులో వివక్ష ఉందని దేశవ్యాప్తంగా ఉద్యమించారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు జూలై 30న హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది.
భారతదేశంలో న్యాయస్థానాలకు కూడా కులం ఉంటుం దని చుండూరు కేసు రుజువు చేసింది. ఏదో ఒక సంఘటన లోను, ఒక కేసును బట్టో దళితులకు న్యాయం జరుగుతుం దని భావించరాదు. ఇది నిరంతర పోరాటం, చుండూరు పోరాటం వెనుక ఉన్న చరిత్రను సరిగా అవగాహన చేసుకోక పోతే ఇది కేవలం కేసుల కోసం పోరాడినట్లే కనబడుతుంది. అయితే ఈ న్యాయపోరాటం దళిత విముక్తి పోరాటంలో భాగమే. అంతిమంగా కులం నిర్మూలన అయ్యే వరకు, భూమి పంపిణీ అయ్యే వరకు ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఈ పోరాటంలో అందరూ భాగస్వాములే.. అం దుకే చుండూరు మృత వీరులు ప్రపంచానికి వేగుచుక్కలు.
(ఆగస్టు 6న చుండూరు బాధితుల 23వ వర్ధంతి సందర్భంగా) కత్తి పద్మారావు