నదిలో కొట్టుకుపోయి.. పాక్లో తేలిన సైనికుడు! | Trooper swept away by river, reaches Pakistan | Sakshi
Sakshi News home page

నదిలో కొట్టుకుపోయి.. పాక్లో తేలిన సైనికుడు!

Aug 7 2014 10:32 AM | Updated on Sep 2 2017 11:32 AM

మన దేశంలో బీఎస్ఎఫ్లో పనిచేస్తున్న సైనికుడు ఒకరు జమ్ము జిల్లాలోని చీనాబ్ నదిలో కొట్టుకుపోయి.. ఏకంగా పాకిస్థాన్లో తేలాడు.

మన దేశంలో బీఎస్ఎఫ్లో పనిచేస్తున్న సైనికుడు ఒకరు జమ్ము జిల్లాలోని చీనాబ్ నదిలో కొట్టుకుపోయి.. ఏకంగా పాకిస్థాన్లో తేలాడు. ఆయనను వెనక్కి రప్పించేందుకు భద్రతాదళాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. సరిహద్దు భద్రతాదళానికి చెందిన సత్యశీల్ యాదవ్ జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో అంతర్జాతీయ సరిహద్దులలో అఖ్నూర్ ప్రాంతంలో వాటర్ పెట్రోలింగ్ విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడు ప్రయాణిస్తున్న మోటారుబోటులో సమస్య తలెత్తడం, బలమైన కెరటాలు వచ్చి బోటును ఢీకొట్టడంతో యాదవ్ నదిలో కొట్టుకుపోయాడు.

అదే పడవలో ఉన్న మరో ముగ్గురు మాత్రం సురక్షితంగా ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చేసినా, యాదవ్ ఉన్న ప్రాంతంలో మాత్రం కెరటాలు బాగా బలంగా, వేగంగా రావడంతో అతడు కొట్టుకపోయాడు. చివరకు పాకిస్థాన్వైపు వెళ్లిపోయాడు. సత్యశీల్ యాదవ్ తమ వద్దే ఉన్నట్లు పాకిస్థానీ రేంజర్లు నిర్ధారించారని, అతడిని వెనక్కి రప్పించేందుకు ఫ్లాగ్ మీటింగ్ పెట్టాల్సిందిగా కోరామని బీఎస్ఎఫ్ వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్లోని సియాల్కోట్ ప్రాంతంలో బాజ్వాత్ గ్రామానికి సత్యశీల్ యాదవ్ కొట్టుకుపోయాడు. అతడు ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ వాసి.

Advertisement
 
Advertisement
Advertisement