అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని పేదరికాన్ని నిర్మూలించేందుకు అభివృద్ధి చెందిన దేశాలు ఉదారంగా మరిన్ని నిధులివ్వాలని పశ్చిమ దేశాలకు భారత్ పిలుపునిచ్చింది.
అభివృద్ధి చెందిన దేశాలకు భారత్ పిలుపు
నైరోబీ: అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని పేదరికాన్ని నిర్మూలించేందుకు అభివృద్ధి చెందిన దేశాలు ఉదారంగా మరిన్ని నిధులివ్వాలని పశ్చిమ దేశాలకు భారత్ పిలుపునిచ్చింది. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల తలసరి ఆదాయంలో భారీ వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో పేదరికాన్ని అంతమొందించేందుకు తొలుత నిర్దేశించుకున్న సాయంకన్నా అధికంగా నిధులివ్వాలని కోరింది. అప్పుడే 2015 తర్వాత అమలు చేసేందుకు నిర్దేశించుకున్న ఎజెండా కార్యరూపం దాలుస్తుందని అభిప్రాయపడింది.
ఈ మేరకు ఇక్కడ జరిగిన ఐక్యరాజ్య సమితి తొలి పర్యావరణ సదస్సులో భారత్ తరఫున హాజరైన కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రసంగించారు. అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే చేసిన వాగ్దానం మేరకు తమ స్థూల జాతీయాదాయంలో(జీఎన్ఐ) నిర్దేశిత శాతాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు అభివృద్ధి సాయం కింద(ఓడీఏ) తక్షణమే ఇవ్వాల్సిన అవసరముందన్నారు. పేదరిక నిర్మూలన పథకాల అమలుకు సాయం చేసేందుకు ఆయా దేశాలు ముందుకు రావాలని కోరారు. ఇప్పటికే హామీ ఇచ్చిన 0.7% జీఎన్ఐ నిధులు సహా అదనపు నిధులు ఇవ్వాలన్నారు.