సీఆర్పీఎఫ్‌ కేంద్రంపై ఉగ్రదాడి.. పుల్వామాలో హైటెన్షన్‌ | terror attack on CRPF training center in Pulwama | Sakshi
Sakshi News home page

సీఆర్పీఎఫ్‌ కేంద్రంపై ఉగ్రదాడి.. పుల్వామాలో హైటెన్షన్‌

Dec 31 2017 9:11 AM | Updated on Jan 1 2018 1:52 PM

terror attack on CRPF training center in Pulwama - Sakshi

శ్రీనగర్‌ : కల్లోల కశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామాలోని సీఆర్పీఎఫ్‌ శిక్షణా కేంద్రంపై మెరుపుదాడికి తెగబడ్డారు. క్షణాల్లో తేరుకున్న భద్రతా సిబ్బంది ఉగ్రమూకలకు ధీటుగా జవాబిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున 2:30 గంటల నుంచి ఎడతెగని కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం కాల్పుల్లో ఒక జవాన్‌ ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌ కొనసాగుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

గ్రెనేడ్లు విసిరి బీభత్సం.. : తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో పుల్వామా జిల్లా కేంద్రంలోని 185వ బెటాలియన్‌ సీఆర్పీఎఫ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లోకి చొరబడిన ఉగ్రవాదులు.. తొలుత గ్రెనేడ్లు విసిరి బీభత్సం సృష్టించే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులు చేశారు. వెంటనే తేరుకున్న భారత బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. క్యాంప్‌లోని ఓ బిల్డింగ్‌లో నక్కిన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. ఒకరు లేదా ఇద్దరు ఉగ్రవాదులు ఉండి ఉండొచ్చని భద్రతా సిబ్బంది భావిస్తున్నారు.

టార్గెట్‌ పుల్వామా : సరిహద్దుకు సమీపంలోని పుల్వామా జిల్లాపై తరచూ ఉగ్రదాడులు జరుగుతున్నాయి. గత ఆగస్టులో పుల్వామా పోలీస్‌ క్యాంపుపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఎనిమిది మంది సిబ్బంది చనిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు 12 గంటల ఆపరేషన్‌ తర్వాత ఉగ్రవాదులను మట్టుపెట్టారు. ఆ తర్వాత రెండు నెలలకే శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టుకు సమీపంలోని బీఎస్‌ఎఫ్‌ క్యాంపు సమీపంలో పేలుడు, కాల్పులు చోటుచేసుకున్నాయి. తాజా దాడికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement