ఒకే పేరున్న ఇద్దరికి ఒకే అకౌంట్‌ నంబర్‌

SBI opens accounts with same number of two men with same name - Sakshi

భిండ్‌: ఒకే పేరున్న ఇద్దరికి ఒకే ఖాతా నంబర్‌ ఇచ్చిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్వాకమిది. ఆ ఇద్దరిలో ఒకరు డబ్బులు డిపాజిట్‌ చేస్తుండగా, మరొకరు వాటిని విత్‌డ్రా చేసి వాడుకున్నాడు. చివరికి విషయం కనుక్కొని ప్రశ్నించగా.. ‘మోదీజీ(ప్రధాని మోదీ)నే నా అకౌంట్‌లో డబ్బులు వేస్తున్నాడనుకున్నా’అని విత్‌ డ్రా చేసుకున్న వ్యక్తి జవాబివ్వడంతో బ్యాంక్‌ అధికారులు అవాక్కయ్యారు. ఈ వింత ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. హుకుమ్‌ సింగ్‌ అనే పేరున్న ఇద్దరికి ఒకే అకౌంట్‌ నెంబర్‌ను ఎస్‌బీఐ ఆలంపూర్‌ బ్రాంచ్‌ కేటాయించింది.

రురాయి గ్రామానికి చెందిన హుకుంసింగ్‌.. స్థలం కొనుక్కునేందుకు డబ్బులు జమ చేయాలనే ఉద్దేశంతో రెగ్యులర్‌గా అకౌంట్‌లో డబ్బులు వేసేవాడు. వాటిని రవుని గ్రామానికి చెందిన హుకుంసింగ్‌ విత్‌ డ్రా చేసుకుని వాడుకునేవాడు. అలా దాదాపు రూ. 89 వేల రూపాయలను విత్‌ డ్రా చేసుకున్నాడు. డిపాజిట్‌ చేసిన డబ్బులు తీసుకుందామని బ్యాంక్‌కు వెళ్లిన హుకుంసింగ్‌కు తన అకౌంట్లో ఉండాల్సిన డబ్బులు విత్‌ డ్రా అయిన విషయం తెలిసింది. మేనేజర్‌కు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఈ విషయమై విత్‌ డ్రా చేసిన హుకుంసింగ్‌ను ప్రశ్నిస్తే.. ‘మోదీజీ ఇస్తున్నాడనుకున్నా. అందుకే వాడుకున్నా’అని జవాబిచ్చాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top