400 ఏళ్లకు పూర్వమే ‘బడ్జెట్‌’ ప్రవేశపెట్టారు

Raja Todarmal Introduced First Budget in Pre independent India - Sakshi

వెబ్‌ డెస్క్‌, హైదరాబాద్‌ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ 2018-19 ఏడాదికిగాను కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అసలు బడ్జెట్‌ను ఎప్పటి నుంచి ప్రవేశపెడుతున్నారు?. స్వాతంత్ర్యం రాకముందు మనదేశంలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌ ఏదో మీకు తెలుసా?. దాదాపు 400 ఏళ్ల క్రితం(16వ శతాబ్దంలో) బడ్జెట్‌ను తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

బడ్జెట్‌ అనే పదం ఫ్రెంచ్‌ పదమైన ‘బౌగెట్టె’ నుంచి ఉద్భవించింది. అయితే, ఇప్పటిలాగా ఓ సూట్‌ కేసులో కాకుండా ఓ సంచితో ఆర్థిక శాఖ మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి బడ్జెట్‌ను ప్రకటించేవారు. తొలిసారిగా అక్బర్‌ చక్రవర్తి నవరత్నాల్లో ఒకరైన రాజా తోడర్‌మల్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇలా ప్రతి ఏటా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం అక్బర్‌ ఆనవాయితీగా నిర్వహించారు.

బడ్జెట్‌ ప్రవేశపెట్టే రోజును రాజ్యంలో పెద్ద ఉత్సవం చేసేవారు. అచ్చూ ఇప్పటిలానే సంవత్సరం వ్యవధిలో ఉండే ఖర్చులు, ఆదాయాలను పద్దులో రాసుకునేవారు. రాజా తోడర్‌మల్‌ ఆర్థిక మంత్రిగా పని చేసిన కాలంలో భారీ ఎత్తున భూ సంస్కరణలను ప్రవేశపెట్టారు. ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వ్యవసాయ రంగంలో మార్పులు తెచ్చేందుకు ప్రయత్నించారు.

ప్రస్తుత ఏడాదికి వ్యవసాయంపై పన్నును నిర్ణయించేందుకు గత పదేళ్లలో పంటల ఉత్పత్తి సగటును తీసుకునేవారు. ఒకటింట నాలుగో వంతు పన్ను ఆదాయం వ్యవసాయం ద్వారానే అందేది. అయితే, ఆ కాలంలో పన్నును వసూలు చేయడం పెద్ద సవాలుగా ఉండేది. భూమి ఎక్కువగా ఉన్న రైతులు వద్ద నుంచి ఎక్కువ పన్ను వసూలు చేసేవారు.

అక్బర్‌ వద్ద ఆర్థిక మంత్రిగా పని చేయడానికి కంటే ముందు రాజా తోడర్‌మల్‌ మూడో మొగల్‌ చక్రవర్తి షేర్‌ షా సూరి వద్ద పని చేశారు. ఈ సమయంలో ఆర్థిక శాస్త్రం, పన్ను తదితర అంశాలపై పట్టు సాధించారాయన. ఆ తర్వాత కాలంలో సొంతగా బడ్జెట్‌ స్పీచ్‌లను తయారు చేశారు. మొఘల్‌ రాజ్యంలో అతిపెద్ద రోడ్డు అయిన గ్రాండ్‌ ట్రంక్‌ రోడ్డు షేర్‌ షా సూరి కాలంలో నిర్మితమైంది.

మౌలిక వసతుల కల్పన కొరకు షేర్‌ షా సూరి ప్రజల వద్ద నుంచి పెద్ద ఎత్తున పన్నులు వసూలు చేసేవారు. ఈయన కాలంలోనే తొలిసారిగా టోల్‌ ట్యాక్స్‌ను ప్రవేశపెట్టారు. రాజా తోడర్‌మల్‌ సలహా మేరకే వస్తు మార్పిడి పద్దతి స్థానంలో డబ్బును తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం వినియోగిస్తున్న రూపాయి పదం రూపయా నుంచి ఉద్భవించింది.

భారత్‌లోకి బ్రిటిష్‌ ప్రవేశించకముందు మొఘల్‌ చక్రవర్తుల్లో సూరి నుంచి అక్బర్‌ వరకూ 40 శాతం నిధులను రక్షణ రంగానికి కేటాయించేవారు. శత్రు దేశాలు తరచూ యుద్ధాలకు దిగడమే ఇందుకు కారణం. 1962లో భారత్‌-చైనాల మధ్య యుద్ధం జరిగిన సమయంలో రక్షణ శాఖకు కేటాయించిన మొత్తం కేవలం 1.59 శాతం నిధులే. కానీ, తర్వాతి 30 ఏళ్లలో రక్షణ శాఖ బడ్జెట్‌ను మూడు శాతానికి పెంచారు. గత మూడేళ్లుగా రూ. 2.74 లక్షల కోట్లను రక్షణ శాఖకు నిధులుగా కేటాయిస్తువస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top