మరఠ్వాడాలో కరువు | Rainfall registered below 50 percent in marathwada | Sakshi
Sakshi News home page

మరఠ్వాడాలో కరువు

Aug 15 2014 10:37 PM | Updated on Oct 8 2018 5:45 PM

వర్షాలు ముఖం చాటేయడంతో మహారాష్ట్రలో ముఖ్యంగా మరఠ్వాడా రీజియన్‌లో మళ్లీ కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి.

సాక్షి, ముంబై: వర్షాలు ముఖం చాటేయడంతో మహారాష్ట్రలో ముఖ్యంగా మరఠ్వాడా రీజియన్‌లో మళ్లీ కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. మూడేళ్లుగా ఇక్కడ కరువు కరాళ నృత్యం చేస్తుండటంతో ప్రభుత్వం ఇప్పుడు దీన్ని సీరియస్‌గా తీసుకుంది. మరఠ్వాడా రీజియన్‌లోని 123 తాలూకాలను కరువు ప్రాంతంగా ప్రకటించాలని  నిర్ణయించింది. వర్షా కాలం ప్రారంభమై దాదాపు రెండున్నర నెలలు కావస్తున్నప్పటికీ ఈ రీజియన్‌లో ఇంతవరకు 50 శాతం వర్షాలు కూడా పడలేదు.

 దీంతో ఇక్కడ పరిస్థితి మరింత విషమించడంతో కరువు ప్రాంతంగా ప్రకటించాలని నిర్ణయం తీసుకుంది. ఆ ప్రకారం ఇక్కడి తాలూకాల్లో వ్యవసాయం పనులకు అమర్చుకున్న విద్యుత్ మోటార్ల బిల్లులో 33 శాతం మాఫీ, విద్యార్థుల పరీక్ష ఫీజు చేయాలని నిర్ణయించింది. కరువు ప్రాంతాలను ప్రకటించే ముందు జిల్లాలవారీగా కాకుండా తాలూకాల వారీగా అధ్యయనం చేశారు. ఇందులో 123 తాలూకాల్లో కరువు తీవ్రంగా ఉందని తేలింది. ఆగస్టులో సరాసరి 68.50 శాతం వర్షం కురిసింది. దీంతో జలాశయాల్లో నీటి మట్టం 61 శాతానికి చేరుకుంది. గత ఏడాది ఇదే సమయంలో 73 శాతం ఉండేది.

మరఠ్వాడా రీజియన్‌లోని అన్ని డ్యాములు కలిపితే సరాసరి 19 శాతం మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయి. ఔరంగాబాద్, లాతూర్, జాల్నా, బీడ్, ఉస్మానాబాద్, నాందేడ్, పర్భణి, హింగోలి, బుల్డాణ, చంద్రాపూర్, యావత్‌మాల్ ఇలా 11 జిల్లాల్లో 50 శాతానికి కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో ఈ జిల్లాలోని తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తెలిపారు.

ఇదిలాఉండగా ఔరంగాబాద్, జాల్నా, హింగోలి, పర్భణి, ఉస్మానాబాద్, బీడ్, బుల్డాణ, చంద్రాపూర్, యవత్మాల్, లాతూర్, నాందేడ్ జిల్లాల్లో కేవలం 26-50 శాతం పొలం పనులు మాత్రమే ప్రారంభమయ్యాయి. అదేవిధంగా రాయ్‌గఢ్, నాసిక్, షోలాపూర్, కొల్హాపూర్, అకోలా, వాషిం, నాందుర్బార్, భండారా, గడ్చిరోలి, అహ్మద్‌నగర్ జిల్లాల్లో రైతులు 51-75 శాతం పనులు మాత్రమే చేపట్టారు. రత్నగిరి, సింధుదుర్గ్, ధుళే, జల్గావ్, అమరావతి, వర్ధా, నాగపూర్, గోండియా జిల్లాల్లో 76-100 శాతం పనులు జరగ్గా పుణే, ఠాణే, సతారా, సాంగ్లీ జిలా ్లల్లో రైతులు వంద శాతానికి పైగా పనులు పూర్తిచేశా రు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కొంత మెరు గ్గా ఉన్నాయి. కాని మరఠ్వాడాలో మాత్రం మూడేళ్ల నుంచి కరవు తాండవిస్తోంది.

 గత ఏడాది పరిస్థితి మరీ దారుణంగా తయారవ్వడంతో స్థానికులు పనుల్లేక వలసలు వెళ్లిపోయారు.  ఉన్న కొద్దిపాటి మంది తాగునీరు లేక విలవిల్లాడారు. ట్యాంకర్ల ద్వారా నీటిసరఫరా చేసినప్పటికీ అవి ఎటూ సరిపోలేదు.

Advertisement
 
Advertisement
Advertisement