‘ప్రభుత్వాన్ని కూల్చే పనిలో బిజీ’
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాల్లో బిజీగా ఉన్న ప్రధాని మోదీ ముడిచమురు ధరల భారీ పతనాన్ని గమనించలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా 21 మంది ఎమ్మెల్యేలతో పార్టీని వీడటంతో కమల్నాథ్ సర్కార్ మైనారిటీలో పడిన క్రమంలో రాహుల్ ఈ ట్వీట్ చేశారు. ‘ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడంలో బిజీగా ఉన్న మీరు అంతర్జాతీయ ముడిచమురు ధరలు 35 శాతం పతనమవడం గమనించనే లేద’ని పీఎంఓను ఉద్దేశిస్తూ రాహుల్ ట్వీట్ చేశారు.
ముడిచమురు ధరలు భారీగా పతనమైన క్రమంలో లీటర్ పెట్రోల్ ధరను రూ 60కి దిగువకు తీసుకువస్తే కుదేలైన ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఇక సింధియా బీజేపీ గూటికి చేరడంతో కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే కమల్నాథ్ ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోతుంది.మరోవైపు జ్యోతిరాదిత్య సింధియా సహకారంతో మధ్యప్రదేశ్లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది.
సంబంధిత వార్తలు