రైల్వేల్లో ప్రైవేటుకు పెద్దపీట | PM Narendra Modi opens Katra rail link, vows to walk Vajpayee's path | Sakshi
Sakshi News home page

రైల్వేల్లో ప్రైవేటుకు పెద్దపీట

Jul 5 2014 4:14 AM | Updated on Aug 15 2018 2:20 PM

దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్ల అభివృద్ధి, సౌకర్యాల మెరుగు దలలో ప్రైవేటురంగాన్ని భాగస్వామ్యం చేయదల చుకున్నట్టు ప్రధాని నరేంద్రమోడీ సూచనప్రాయంగా తెలిపారు.

* జమ్మూకాశ్మీర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ
* కాత్రాలో కొత్త రైలు జాతికి అంకితం
* యూరీలో 240 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రానికి ప్రారంభోత్సవం

 కాత్రా: దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్ల అభివృద్ధి, సౌకర్యాల మెరుగు దలలో ప్రైవేటురంగాన్ని భాగస్వామ్యం చేయదల చుకున్నట్టు ప్రధాని నరేంద్రమోడీ సూచనప్రాయంగా తెలిపారు. దేశంలో విమానాశ్రయాలకంటే, రైల్వే స్టేషన్లే మెరుగ్గా ఉండాలని తాను కోరుకుంటున్నట్టు జమ్ముకాశ్మీర్‌లోని కాత్రాలో ఆయన అన్నా రు. త్వరలోనే పిపిపి పద్ధతిలో రైల్వేస్టేషన్‌లను ఆధునీకరించ టంపై దృష్టి సారిస్తామన్నారు. జమ్మూలోని వైష్ణోదేవి ఆలయా నికి బేస్‌క్యాంప్ అయిన కాత్రాలో కొత్త రైల్వే లైనును శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఆర్థికంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు పీపీపీ లాభదాయకంగా ఉంటుందని మోడీ అన్నా రు.
 
 దేశంలో శాంతిస్థాపనకు బలమైన సైనిక శక్తి ఉండటం అత్యవసరమని మోడీ స్పష్టం చేశారు.  ప్రధాని పగ్గాలు చేపట్టాక శుక్రవారం తొలిసారిగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోడీ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జమ్మూలోని వైష్ణోదేవి ఆలయానికి వెళ్లేందుకు బేస్‌క్యాంపుగా ఉన్న కాత్రాలో కొత్తగా నిర్మించిన రైలు మార్గంలో ప్రవేశపెట్టిన కాత్రా-న్యూఢిల్లీ (వయా ఉధంపూర్) రైలును మోడీ  జెండాఊపి ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. ఈ రైలుకు శ్రీశక్తి ఎక్స్‌ప్రెస్‌గా పేరు పెట్టాలని అధికారులకు సూచించారు. కాత్రాకు ఇప్పటివరకూ రైలు మార్గం లేకపోవడంతో వైష్ణోదేవి ఆలయ దర్శనం కోసం వచ్చే భక్తులు జమ్మూ వరకూ రైల్లో వచ్చి అక్కడి నుంచి బస్సులో కాత్రాకు చేరుకొని అనంతరం 14 కి.మీ దూరంలోని ఆలయానికి వెళ్లాల్సి వచ్చేది. కాశ్మీర్ రైలు లింక్ ప్రాజెక్టులో భాగంగా కాత్రా-ఉధంపూర్ మధ్య 25 కి.మీ రైలుమార్గాన్ని రూ. 1,132.75 కోట్లతో నిర్మించారు.
 
 ఈ సందర్భంగా కాత్రా స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సభలో మోడీ మాట్లాడుతూ వైష్ణోదేవి యాత్రకు వచ్చే భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త రైలు మార్గం రాష్ట్రాభివృద్ధిని వేగవంతం చేస్తుందన్నారు. ‘‘అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రారంభించిన ప్రయాణాన్ని (రాష్ట్రాభివృద్ధి) మేం కొనసాగిస్తాం. తద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడి మనసు గెలుచుకోవడమే మా ప్రభుత్వ లక్ష్యం. ఈ రైలు కేవలం రాష్ర్ట ప్రజలకేగాక యావత్ దేశానికే బహుమతి’’ అని పేర్కొన్నారు. బాంద్రా, న్యూఢిల్లీ, కాల్కా, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు నుంచి కాత్రాకు త్వరలోనే ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. జమ్మూ-ఉధంపూర్ మధ్య లోకల్ రైళ్లను కాత్రా వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రైల్వేమంత్రి సదానందగౌడ, జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా పాల్గొన్నారు.
 
విద్యుత్ రంగంలో పీపీపీ పద్ధతి కావాలి
 విద్యుత్ రంగంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానం అవసరమని మోడీ అభిప్రాయపడ్డారు. పునర్వినియోగ ఇంధన వనరులే పెరుగుతున్న దేశ విద్యుత్ అవసరాలను తీర్చగలవన్నారు. బారాముల్లా జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) సమీపంలో ఉన్న యూరీలో ఝీలం నదిపై నిర్మించిన 240 మెగావాట్ల యూరీ-2 జలవిద్యుత్ కేంద్రాన్ని మోడీ ప్రారంభించారు. స్థానిక కేంద్రీయ విద్యాలయ హైస్కూల్‌ను హయ్యర్ సెకండరీ స్కూల్‌గా మార్చాలన్న ప్రజల డిమాండ్‌పై అప్పటికప్పుడు మోడీ ఆమోదించారు.
 
 రక్షణ ఉత్పత్తుల్లో స్వావలంబన అవసరం
 రక్షణరంగ ఉత్పత్తుల్లో స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉందని మోడీ పేర్కొన్నారు. దేశానికి పూర్తిస్థాయిలో ముప్పును నివారించేందుకు ఇది ఎంతో అవసరమన్నారు. శ్రీనగర్‌లోని సైనిక చినార్ కోర్‌లో జరిగిన సైనిక సమ్మేళనంలో జవాన్లు, సైనికాధికారులను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. జవాన్లను సంతోషంగా ఉంచేందుకు తన ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని మోడీ హామీ ఇచ్చారు. ‘‘జవాను సంతోషంగా ఉన్నప్పుడే మాతృభూమికి సేవ చేయగలడు’’ అన్నారు. ప్రసంగానికి ముందు అమర జవాన్ల స్తూపానికి  నివాళులర్పించారు.
 
అమెరికాకు మోడీ శుభాకాంక్షలు: శుక్రవారం అమెరికా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోడీ ఆ దేశ ప్రజలకు ‘ట్విట్టర్’లో శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement