
సాక్షి,న్యూఢిల్లీ: నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి సాహసోపేత నిర్ణయాల తర్వాత ప్రజల్లో తిరిగి విశ్వాసం నింపేందుకు ప్రధాని మోదీ శ్రమిస్తున్నారని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ అన్నారు. దేశ ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలు తీసుకునేందుకే ప్రజలు మోదీని ఎన్నుకున్నారని, ఆ దిశగానే ఆయన పనిచేస్తున్నారని చెప్పారు.
యథాతథ స్థితి కొనసాగించేందుకు ప్రజలు ప్రధానిగా మోదీకి పట్టం కట్టలేదని అన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి కఠిన నిర్ణయాలు తప్పవని ఈ సంస్కరణలపై వ్యాఖ్యానిస్తూ స్మృతీ పేర్కొన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో మాట్లాడుతూ సంక్లిష్ట సమయాల్లో దీటైన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రజలు మోదీ వైపు చూశారని, ఇప్పుడాయన అదే పనిలో ఉన్నారని అన్నారు.జీఎస్టీ అమలు సవాళ్లతో కూడుకున్నదేనని, అయితే ధృడమైన ఆర్థిక వ్యవస్థ, ఉత్పాదకత పెంపుకు దీటైన పన్ను వ్యవస్థ ఫౌండేషన్ వంటిదన్నారు.