భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం | pm modi announced sensational decision | Sakshi
Sakshi News home page

భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం

Nov 8 2016 8:23 PM | Updated on Aug 15 2018 2:30 PM

భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం - Sakshi

భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం

భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నేటి అర్థరాత్రి నుంచి రూ.500, రూ.వెయ్యి నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నేటి అర్థరాత్రి నుంచి రూ.500, రూ.వెయ్యి నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ఈ నిర్ణయం వెలువరించారు. ప్రధాని మోదీ మంగళవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి రూ. 500, రూ. వెయ్యినోట్లు పనిచేయబోవని మోదీ స్పష్టం చేశారు. దేశంలో భారీగా పోగుపడ్డ నల్లధనాన్ని నిరోధించేందుకు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రజల వద్ద ఉన్న రూ. వెయ్యి, రూ. 500 నోట్లను మార్చుకోవడానికి డిసెంబర్‌ 30 వరకు సమయం ఇచ్చారు. ఆలోపు బ్యాంకులు, లేదా పోస్టాఫీస్‌లకు వెళ్లి రూ. 500, రూ. వెయ్యి నోట్లను మార్చుకోవాలని ప్రజలకు సూచించారు. 
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ నినాదానికి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు.  ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ గొప్పస్థానం సంపాధించుకుందని మోదీ అన్నారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు భారత ఆర్థిక వ్యవస్థను కొనియాడాయని చెప్పారు. భారత్ వేగంగా అభివృద్ధి సాధిస్తోందని తెలిపారు. 

పేదవారు స్వయం సమృద్ధి సాధించేలా చేయడమే తమ ప్రధాన లక్ష్యం అని, ఈ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, ఎప్పటికీ ఇలాగే ఉంటుందని మోదీ చెప్పారు. అవినీతి నిర్మూలనకోసం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు. గత ప్రభుత్వాలు పేదల అవసరాలు పట్టించుకోలేదని, దొంగనోట్లు అభివృద్ధికి అవరోదంగా మారాయని, పొరుగు దేశం దొంగనోట్లను రవాణా చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. నకిలీ నోట్లలో 90శాతం వెయ్యి, రూ.500 నోట్లే ఉంటున్నాయని మోదీ చెప్పారు. అభివృద్ధికి ఉగ్రవాదం పెద్ద అడ్డంకిగా మారిందని అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement