మన ఎంపీలను కాదని వారిని స్వాగతిస్తారా..?
సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్లో క్షేత్రస్ధాయి పరిస్ధితులను పరిశీలించేందుకు 27 మంది సభ్యులతో కూడిన ఐరోపా యూనియన్ ప్రతినిధి బృందం శ్రీనగర్కు చేరుకుంది. రాజకీయ నేతలను కశ్మీర్ సందర్శించకుండా నియంత్రణలు విధించిన నేపథ్యంలో ఈయూ బృందం పర్యటనపై విపక్ష నేతలు ప్రభుత్వాన్ని నిలదీశారు. జమ్ము కశ్మీర్ పర్యటనకు యూరప్ ఎంపీలను సాదరంగా స్వాగతిస్తూ భారత ఎంపీలను అక్కడికి వెళ్లకుండా నిరోధిస్తున్నారు. ఈ తరహాలో ప్రభుత్వం వ్యవహరించడం సరైంది కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
మరోవైపు యూరప్ ఎంపీలను కశ్మీర్ పర్యటనకు అనుమతిస్తూ, మన ఎంపీలను ఎయర్పోర్ట్లోనే తిప్పిపంపడాన్నిప్రియాంక గాంధీ ఆక్షేపిస్తూ ఇది వినూత్న జాతీయవాదం అని ఎద్దేవా చేశారు. ఇక ఇస్లాంఫోబియాతో బాధపడుతున్న ఎంపీలు కశ్మీర్ను సందర్శిస్తున్నారంటూ ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్ము కశ్మీర్లో పర్యటించే రాజకీయ నేతలను ప్రభుత్వం నిరోధించిన సంగతి తెలిసిందే. మాజీ సీఎంలు సహా పలువురు నేతలను గృహ నిర్బంధం చేయడంతో పాటు కశ్మీర్లో పలు ఆంక్షలు, నియంత్రణలు విధించింది.