ఓలా, ఉబర్‌ క్యాబ్‌ డ్రైవర్ల దేశవ్యాప్త సమ్మె

Ola Uber Drivers Going To Strike From Monday - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : యాజమాన్య నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ.. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఓలా, ఉబర్‌ క్యాబ్‌ డ్రైవర్లు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నారు. ఈ నెల 19న దేశవ్యాప్తంగా తమ సేవలను నిలిపివేయనున్నారు. ఈ సమ్మె ముఖ్యంగా ముంబాయి, బెంగుళూరు, న్యూఢిల్లీ, హైదరాబాద్‌, పుణే లాంటి ముఖ్య నగరాల్లో తీవ్ర ప్రభావం చూపనుంది.  

ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఓలా, ఉబెర్‌ డ్రైవర్లు ఈ పోరాటానికి సిద్ధమవుతున్నారు. గతంలో అనేకసార్లు నిరసనలు, సమ్మెలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో మరోసారి సమ్మెబాట పడుతున్నారు. రేటిటినుంచి సమ్మె ప్రారంభం కానుందని ఈ పోరాటానికి నేతృత్వం వహిస్తున్న మహారాష్ట్ర నవనిర్మాణ్‌ వాహతుక్‌ సేన ప్రతినిధి సంజయ్‌ నాయక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర యూనియన్లు కూడా సమ్మెకు మద్దతు తెలిపాయని చెప్పారు.

ఎన్నో ఆశలతో ఏడు లక్షల వరకు ఖర్చు చేసి క్యాబ్‌లను కొనుగోలు చేశామని, ఇప్పుడు యాజమాన్య నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది డ్రైవర్లు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలంటూ ఓలా, ఉబెర్‌  కార్యాలయాల ముందు ఆందోళన కార్యక్రమాలను చేపడతామని నాయక్‌ తెలిపారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే తమ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top