మంత్రముగ్ధులను చేస్తున్న ‘మన్‌కీ బాత్‌’ | Modi's speech is a huge response from Indians in over 150 countries | Sakshi
Sakshi News home page

మంత్రముగ్ధులను చేస్తున్న ‘మన్‌కీ బాత్‌’

May 22 2017 12:41 AM | Updated on Oct 9 2018 4:36 PM

మంత్రముగ్ధులను చేస్తున్న ‘మన్‌కీ బాత్‌’ - Sakshi

మంత్రముగ్ధులను చేస్తున్న ‘మన్‌కీ బాత్‌’

ప్రతి నెలా రేడియోలో ప్రసారమయ్యే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన్‌కీ బాత్‌’కు భారీ స్పందన వస్తోంది.

మోదీ ప్రసంగానికి 150 దేశాల్లో భారతీయుల నుంచి భారీ స్పందన
న్యూఢిల్లీ: ప్రతి నెలా రేడియోలో ప్రసారమయ్యే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన్‌కీ బాత్‌’కు భారీ స్పందన వస్తోంది. 150 దేశాల్లో భారతీయులకు చేరుతున్న ఈ ప్రసంగాన్ని ఎన్‌ఆర్‌ఐలు విశేషంగా ఆదరిస్తున్నారని ఆలిండియా రేడియో (ఎయిర్‌) విదేశీ సేవల విభాగం డైరెక్టర్‌ అమ్లాన్‌జ్యోతి మజుందార్‌ చెప్పారు. హిందీలో ప్రత్యక్ష ప్రసారం అవుతున్న ‘మన్‌కీ బాత్‌’ను ఆంగ్లం, రష్యన్, ఫ్రెంచ్, చైనీస్, ఉర్దూ తదితర భాషల్లోకీ అనువాదం చేసి వినిపిస్తున్నట్టు వెల్లడించారు.

ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న భారతీయులందరికీ తమ ప్రధానితో అనుసంధానమయ్యే హక్కు ఉందన్నారు. మోదీ ప్రసంగం ప్రసారమైనప్పుడల్లా విదేశాల్లోని భారతీయుల నుంచి అనూహ్య స్పందన వస్తోందని, అధిక సంఖ్యలో సందేశాలు కూడా పంపుతున్నారని తెలిపారు. ముఖ్యంగా గుజరాతీయులు అధికంగా ఉన్న ఆఫ్రికా దేశాల నుంచి ఎక్కువగా స్పందిస్తున్నారన్నారు. ‘మోదీ ప్రసంగం మంత్రముగ్ధులను చేస్తోంది. ఆయన మా దేశానికి ఎప్పుడు వస్తారు’అంటూ న్యూజిలాండ్‌ నుంచి ఓ శ్రోత మెసేజ్‌ పంపారని మజుందార్‌ చెప్పారు.

నోట్ల రద్దు నిర్ణయంపై అభినందనలు...
దేశంలో కొన్ని వర్గాలు తీవ్రంగా విమర్శించినా... ప్రధాని మోదీ తీసుకున్న పెద్ద నోట్ల నిర్ణయాన్ని విదేశాల్లోని శ్రోతలు అభినందించారని మజుందార్‌ వెల్లడించారు. అవినీతిపై పోరాటానికి పడిన అడుగుగా దీన్ని అభివర్ణించారన్నారు. ‘మన్‌కీ బాత్‌’కు ఇంతటి స్పందన రావడానికి మోదీకి భారీ స్థాయిలో అభిమానులుండటం కూడా ఒక కారణమన్నారు. ఆలిండియా రేడియో వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయ్యి కూడా ‘మన్‌కీ బాత్‌’వినవచ్చన్నారు.

పెరిగిన విదేశీ పర్యాటకులు...
మూడేళ్లుగా మోదీ వెళ్లొచ్చిన దేశాల నుంచి పర్యాటకులూ పెరిగారని పర్యాటక శాఖ అధికారి తెలిపారు. 2014లో అధికారం చేపట్టినప్పటి నుంచి మోదీ 55 విదేశీ పర్యటనలు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌ సామాజిక మాధ్యమంలో ప్రపంచ నేతల్లో అత్యధిక ఫాలోయింగ్‌ ఉన్న నేతగా మోదీ నిలిచారు. 6.9 మిలియన్‌ ఫాలోవర్స్‌తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కంటే ముందున్నట్టు అధ్యయనం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement