ఎమ్మెల్యే కూతురు.. సినీ నిర్మాత
సస్పెన్స్ రేపిన ప్రేమ పెళ్లి
పోలీసుల అదుపులో బంధువులు
సోషల్ మీడియాలో కొత్త జంట వీడియో హల్చల్
సాక్షి, మైసూరు: మైసూరులో ఓ ప్రేమ పెళ్లి సస్పెన్స్ రేపింది. దావణగెరె జిల్లా మాయకొండ ఎమ్మెల్యే శివమూర్తి నాయక్ కుమార్తె లక్ష్మి, కన్నడ మాస్తిగుడి సినిమా నిర్మాత పి.సుందర్గౌడ ఇద్దరు సినిమా రీతిలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. మైసూరు చాముండి కొండపై గురువారం తెల్లవారుజామున మూడుముళ్లతో ఒక్కటయ్యారు. వరుని బంధువులు మాత్రమే ఈ పెళ్ళిలో పాల్గొన్నారు. వీరందరూ బుధవారం సాయంత్రమే మైసూరు నగరంలో ఉన్న హోటల్లో దిగారు. తెల్ల వారుజామున గుట్టుగా చాముండి కొండకు చేరుకుని పెళ్లి కార్యక్రమం ముగించారు.
రంగంలోకి బెంగళూరు పోలీసులు
బుధవారం ఎమ్మెల్యే శివముర్తి నాయక్ తన కుమార్తె కనిపించడం లేదని బెంగళూరులోని యలహంక ఉపనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి కుటుంబం అక్కడే ఉంటోంది. ఉదయమే పోలీసులు మైసూరులో హోటల్ వద్దకు వచ్చి సీసీ కెమెరా చిత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బంధువులు కొండపై నుంచే కొత్త జంటను ఎటో పంపించేసి హోటల్ వద్దకు చేరుకున్నారు. బంధువులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
హోటల్ యజమాని మాట్లాడుతూ.. బుధవారం సాయంత్రం నిర్మాత బంధువులు వచ్చి నాలుగు గదులను బాడుగకు తీసుకొన్నారని, ఉదయమే అందరూ కలిసి చాముండి కొండకు వెళ్లారని చెప్పారు. బెంగళూరు నుంచి సుమారు 40 మందికి పైగా పోలీసులు ఇక్కడికి చేరుకోని బంధువులను విచారణ చేస్తున్నారని తెలిపారు. మరోపక్క వధూవరుడు రహస్యంగా బెంగళూరు వైపు వెళ్ళినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు దాఖలైన పీఎస్కు వెళ్లి తమది ఇష్టపూర్వక వివాహమేనని ప్రకటించనున్నారు.
తన ఇష్టం ప్రకారమే పెళ్ళి
సెల్ఫీ వీడియో పంపిన వధువు
వధూవరులు లక్ష్మి– సుందర్లు ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పెళ్లికూతురు మాట్లాడుతూ.. తాను– సుందర్గౌడ ఇద్దరం ప్రేమించుకొని పెళ్ళి చేసుకున్నామని తెలిపారు. ఈ పెళ్ళి తన ఇష్ట ప్రకారమే జరిగిందని, ఎవరూ ఎలాంటి ఒత్తిడి చేయలేదని, మా వల్ల ఎవరికి ఇబ్బంది కలిగించ వద్దని వేడుకున్నారు. వీరిద్దరి మధ్య సుమారు ఆరునెలల నుంచి ప్రేమాయణం సాగుతోందని తెలుస్తోంది.