
పుణే: వర్షాలు కురవాలంటే వాహనాల టైర్లు, చెట్టు రెమ్మలు, ఉప్పు మండించాలని మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా కలెక్టర్ జారీచేసిన ఉత్తర్వులు వివాదాస్పదమయ్యాయి. ఇలాంటి చర్యలతో వాతావరణానికి తీరని నష్టం వాటిల్లుతుందని పర్యావరణవేత్తల ఆందోళనతో ఆయన వెనక్కి తగ్గారు. ఐఐటీ బాంబే పూర్వ పరిశోధకుడి సలహా మేరకు తాను ఈ విధంగా ఆదేశించినట్లు కలెక్టర్ రాజేంద్ర భోస్లే వివరణ ఇచ్చారు. ఈ సీజన్లో సోలాపూర్లో సగటు వర్షపాతంలో 35 శాతమే కురిసింది. కరువు తప్పదన్న ఆందోళనల నడుమ ఆయన ఈ వింత ఆదేశాలిచ్చారు. జిల్లాలోని సుమారు వేయి చోట్ల టైర్లు, చెట్లరెమ్మలు, ఉప్పు మండిస్తే 24–96 గంటల్లో వర్షపాతం కురుస్తుందని 11 మంది తహసీల్దార్లకు ఆదేశాలు జారీచేశారు.