షోపియాన్‌లో ఎన్‌కౌంటర్‌: ఇద్దరు ఉగ్రవాదులు హతం | Encounter Underway In Jammu And Kashmir Shopian | Sakshi
Sakshi News home page

షోపియాన్‌లో ఎన్‌కౌంటర్‌: ఇద్దరు ఉగ్రవాదులు హతం

Feb 27 2019 8:27 AM | Updated on Mar 28 2019 9:05 AM

Encounter Underway In Jammu And Kashmir Shopian - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌లో భద్రత బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదరుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో జైషే మహమ్మద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రత దళాలు మట్టుపెట్టాయి.  పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా జైషే మహమ్మద్‌ ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం మెరుపు దాడులు జరిపి కొన్ని గంటలైన గడవకముందే.. మరోసారి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. షోపియాన్‌ జిల్లాలో మెమందర్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రత బలగాలు బుధవారం తెల్లవారుజామున కార్డన్‌ సెర్చ్‌ చేపట్టాయి. ఆ సమయంలో ఉగ్రవాదులు భద్రత బలగాలపై కాల్పులు దిగినట్టు అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కాల్పులను తిప్పికొట్టడానికి భద్రత బలగాలు ఎదురు కాల్పులు జరుపుతున్నట్టు వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు ఎవరు గాయపడలేదని సమాచారం.

సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడ్డ పాక్‌..
మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్‌ ఆర్మీ కాల్పులకు తెగబడింది. మంగళవారం సాయంత్రం నుంచి సరిహద్దు వెంబడి దాదాపు 15 చోట్ల ఇష్టా రాజ్యంగా పాక్‌ కాల్పులు జరిపింది. పాకిస్తాన్‌ బలగాలు జరిపిన కాల్పులో ఐదుగురు భారత జవాన్లు గాయపడ్డారు. సరిహద్దులోని పలు చోట్ల ఇళ్లు ధ్వంసం అయ్యాయి. పాక్‌ ఆర్మీకి ధీటుగా బదులిచ్చిన భారత దళాలు పాకిస్తాన్‌కు చెందిన ఐదు పోస్టులను ధ్వంసం చేశాయి. (సర్జికల్‌ స్ట్రయిక్స్‌ 2 సక్సెస్‌)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement