భారీ స్కాంలో ‍ప్రముఖ నటికి నోటీసులు | ED notice To Ritu Parnasan Gupta On rose Valley Scandal | Sakshi
Sakshi News home page

భారీ స్కాంలో ‍ప్రముఖ నటికి నోటీసులు

Jul 10 2019 4:28 PM | Updated on Jul 10 2019 4:30 PM

ED notice To Ritu Parnasan Gupta On rose Valley Scandal - Sakshi

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లో సంచలనంగా మారిన రోస్‌వ్యాలీ కుంభకోణంలో ఒక్కొక్కరూ బయటపడుతున్నారు. ఈ భారీ స్కాంలో ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను అరెస్ట్‌ చేసిన అధికారులు విచారణను మరింత ముమ్మరం చేశారు. తాజాగా బెంగాల్‌ ప్రముఖ సినీ నటి రీతూపర్ణ సేన్‌గుప్తాకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారేచేసింది. విచారణ నిమిత్తం వారంలోపు తమ ముందు హాజరుకావాలంటూ ఆదేశించింది. బాలీవుడ్, బెంగాలీతో పాటు టాలీవుడ్‌లో కూడా రీతుపర్ణ నటించిన విషయం తెలిసిందే. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన 'ఘటోత్కచుడు' సినిమాలో నటించి ఆమె ప్రేక్షకులను అలరించింది.

కాగా ఇదే కుంభకోణంలో ప్రముఖ నటుడు, బెంగాల్‌ సూపర్‌ స్టార్ ప్రసేన్‌జిత్‌ ఛటర్జీకి హస్తముందంటూ మంగళవారం ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. రోస్‌వ్యాలీ కంపెనీ నేతృత్వంలో 2010-12 మధ్య కాలంలో పలు సినిమాలను నిర్మించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వారితో ఛటర్జీతో పాటు పలువురు భారీ మొత్తంలో నగదు లావాదేవీలు జరిపారని ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. దీనిపై జూలై 19లోగా తమ ముందు విచారణకు హాజరుకావాలని ఛటర్జీని ఆదేశించింది. ఈ పరిణామం బెంగాల్‌ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

బెంగాల్‌లో సంచలనంగా మారిన రోజ్‌వ్యాలీ స్కాంలో ఇప్పటికే అనేక రాజకీయ, సినీ ప్రముఖులను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ముందు కూడా రోజ్‌వ్యాలీ కుంభకోణం పెద్ద దుమారమే చెలరేగింది. శారదా, రోజ్‌వ్యాలీ కుంభకోణాల కేసుల్ని విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తున్న రాజీవ్‌కుమార్‌ను సీబీఐ అరెస్ట్‌ చేసింది. బెంగాల్‌ ప్రముఖ నిర్మాత శ్రీకాంత్‌ మోహతా కూడా ఈ స్కాంలో ఉన్నారని.. రూ. 25కోట్లు  తీసుకున్న ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement