వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించటానికి, బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీగా అధికారంలోకి రాకుండా నిరోధించటానికి..
సీపీఐ జాతీయ కార్యవర్గ సదస్సు నిర్ణయం
వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించటానికి, బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీగా అధికారంలోకి రాకుండా నిరోధించటానికి.. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలోనే ప్రాంతీయ లౌకిక ప్రజాస్వామ్య పార్టీలతో పొత్తులు, సీట్ల సర్దుబాటు కుదుర్చుకోవాలని సీపీఐ నిర్ణయించింది. ఢిల్లీలో రెండు రోజులు కొనసాగిన సీపీఐ జాతీయ కార్యవర్గ సదస్సు శనివారం ముగిసింది. ఎన్నికల అనంతరం కేంద్రంలో కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించేందుకు వచ్చే లోక్సభలో బలమైన వామపక్ష విభాగం ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది. ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను విశ్లేషించిన పార్టీ నాయకులు నూతన సరళీకరణ విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయం ఉన్నచోట్ల ప్రజలు ఆ ప్రత్యామ్నాయం వైపే మొగ్గుచూపారనే అభిప్రాయానికి వచ్చారు.
ఢిల్లీలో ‘ఆప్’ అలా ముందుకు వచ్చి మంచి ఫలితాలు సాధించిందని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా అన్నారు. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల ఏర్పాట్ల గురించి చర్చించిన పార్టీ అగ్రనాయకత్వం.. పార్టీ పోటీ చేయాల్సిన నియోజకవర్గాలను గుర్తించాల్సిందిగా రాష్ట్ర నాయకత్వాలను కోరామన్నారు. పార్టీ జాతీయ కార్యవర్గం జనవరిలో ఏర్పాట్లను సమీక్షించి 2014 ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. పార్టీ రాష్ట్ర విభాగాలు తమతమ రాష్ట్రాల్లో పరిస్థితులను అంచనావేసి.. పార్టీ వ్యూహాత్మక వైఖరికి అనుగుణంగా సంబంధిత రాష్ట్రంలో ఎన్నికల సర్దుబాట్లను నిర్ణయించాల్సి ఉంటుందని చెప్పారు.