ప్రధాన మంత్రి కార్యాలయం, గుజరాత్ ప్రభుత్వానికి కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) నోటీసులు జారీ చేసింది.
న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్ల (2002) తర్వాత అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, గుజరాత్ సీఎం నరేంద్ర మోదీకి మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాల సమాచారానికి సంబంధించి ప్రధాన మంత్రి కార్యాలయం, గుజరాత్ ప్రభుత్వానికి కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) నోటీసులు జారీ చేసింది. ఆర్టీఐ చట్టం ప్రకారం మూడో వ్యక్తి అభిప్రాయం కూడా అవసరమన్న ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను చూపుతూ నవంబర్ మొదటి వారం కేసు విచారణ సమయంలో వివరణ ఇవ్వాలంటూ నోటీసులిచ్చింది.
ప్రముఖ ఆర్టీఐ కార్యకర్త సుభాష్ అగర్వాల్ 2013, డిసెంబర్ 16న సమాచారహక్కు దరఖాస్తు దాఖలు చేశారు. మోదీ, వాజపేయి మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాల వివరాలు ఇవ్వాలని అభ్యర్థించారు. అగర్వాల్ కంటే ముందు ఈ సమాచారం కోసం మరొకరు ఆర్టీఐ దరఖాస్తు పెట్టారు. అయితే ఈ సమాచారం ఇచ్చేందుకు పీఎంవో నిరాకరించింది.