‘సోహ్రాబుద్దీన్‌’ కేసులో సీబీఐకి అక్షింతలు

Bombay High Court asked CBI on the case of Sohrabuddin encounter

ముంబై: సోహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను నిర్దోషులుగా విడుదల చేస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును ఎందుకు సవాల్‌ చేయలేదని సీబీఐని బాంబే హైకోర్టు ప్రశ్నించింది. ట్రయల్‌ కోర్టు ఉత్తర్వులను సవాలుచేస్తూ సోహ్రాబుద్దీన్‌ సోదరుడు రుబాబుద్దీన్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి జస్టిస్‌ రేవతి మెహితే దెరే.. పిటిషనర్‌తోపాటు సీబీఐ కూడా ట్రయల్‌ కోర్టు తీర్పుపై నిరాశ చెంది ఉండాల్సిందని వ్యాఖ్యానించారు.

సోహ్రాబుద్దీన్‌ కేసులో ఐపీఎస్‌ అధికారులు రాజ్‌కుమార్‌ పాండియన్, డీజీ వంజరా, ఎంఎన్‌ దినేశ్‌లను నిర్దోషులుగా విడిచిపెట్టడాన్ని సీబీఐ సవాలు చేయబోతుందా? లేదా? అని ప్రశ్నించారు. ఈ కేసులో ఐపీఎస్‌ అధికారులను కాకుండా కేవలం ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్ల విడుదలను మాత్రమే సీబీఐ వ్యతిరేకించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం అందరికీ ఒకేలా వర్తిస్తుందన్నారు. ఈ కేసులో మొత్తం 15 మంది ఐపీఎస్‌ అధికారుల్లో 14 మంది విడుదల అయ్యారన్నారు. నిందితులపై ఎలాంటి అభియోగాలు నమోదు చేయొద్దన్న న్యాయమూర్తి.. తదుపరి విచారణను అక్టోబర్‌ 12కు వాయిదా వేశారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top