బీజేపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం

BJP MLA Faces Embarrassing Situation Over Second Marriage - Sakshi

సాక్షి, ముంబై : బీజేపీ ఎమ్మెల్యే రాజు నారాయణ తోడ్సమ్‌కు చేదు అనుభవం ఎదురైంది. రెండో భార్యతో కలిసి ఉంటూ తనను నిర్లక్ష్యం చేస్తున్న కారణంగా రాజు నారాయణ మొదటి భార్యతో తల్లి కూడా రోడ్డుపైనే ఆయనను చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అసలేం జరిగిందంటే..
మహారాష్ట్రలోని ఆర్ని(ఎస్టీ)నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న రాజు నారాయణ తన రెండో భార్య ప్రియాతో కలిసి మంగళవారం 42వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకొన్నారు. అనంతరం ఓ క్రీడా కార్యక్రమాన్ని ప్రారంభించి ఇంటికి తిరిగి వెళ్లేందుకు పయనమయ్యారు. ఈ క్రమంలో నారాయణ తల్లి, ఆయన మొదటి భార్య అర్చన అక్కడికి చేరుకున్నారు. వారిని వాహనాన్ని అడ్డగించి ప్రియాను కిందకి లాగి ఆమెపై దాడి చేశారు. చెంప దెబ్బలు కొడుతూ, తన్నుతూ ఆమెపై పిడిగుద్దులు కురిపించారు. దీంతో ప్రియాను కాపాడేందుకు వాళ్లకు అడ్డుపడిన రాజు నారాయణను కూడా చితకబాదారు. వీరికి అక్కడ ఉన్న స్థానికులు కూడా మద్దతుగా నిలిచారు.

ప్రధానికి ఫిర్యాదు చేస్తాం
ఈ ఘటనపై స్పందించిన రైతు నాయకుడు కిషోర్‌ తివారీ మాట్లాడుతూ.. ‘ ఓ ప్రజాప్రతినిధి ఇలా సిగ్గులేకుండా మరో మహిళతో ఉంటూ తన భార్యకు అన్యాయం చేస్తున్నారు. ఆయన ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న అర్చనకు, ఆమె ఇద్దరు పిల్లలకు 48 గంటల్లోగా న్యాయం చేయాలి. లేనిపక్షంలో శనివారం ఇక్కడి రానున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేస్తాం అని పేర్కొన్నారు.

ఇక బీజేపీ ట్రైబల్‌ వింగ్‌ చీఫ్‌ అంకిత్‌ మాట్లాడుతూ రాజు నారాయణ తన మొదటి భార్యకు న్యాయం చేయకపోతే ప్రధాని మోదీ, సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో వేదిక పంచుకోనివ్వమని పేర్కొన్నారు. అదేవిధంగా మహిళా వ్యతిరేకత మూటగట్టుకుంటే రాజు నారాయణ వచ్చే ఎన్నికల్లో టికెట్‌ కూడా పొందలేరని వ్యాఖ్యానించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి కేసు నమోదు కాలేదు. ఈ విషయం గురించి పోలీసు అధికారి డీఎస్‌ తెంబరే మాట్లాడుతూ..  ఘటన జరిగిన తర్వాత ఇరువర్గాలు పోలీసు స్టేషనుకు వచ్చాయని, సామరస్యంగా సమస్య పరిష్కరించుకుంటామని చెప్పడంతో కేసు నమోదు చేయలేదని తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top